Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘీభావం తెలపాలని ఐదు వామపక్షపార్టీల పిలుపు
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో రైతు బిల్లులను ఆమోదింపజేసుకున్న తీరును ఐదు వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దేశ పార్లమెంట్పై జరిగిన ఈ విధ్వంసకర దాడిని నిరసించాలని, బిల్లులకు వ్యతిరేకంగా ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్(ఏఐకేఎస్సీ) ఈ నెల 25న తలపెట్టిన దేశవ్యాప్త నిరసనకు మద్దతుతో పాటు సంఘీభావం ప్రకటించాలని తమ పార్టీ రాష్ట్ర శాఖలకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ పార్టీల ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య, దేభబ్రత బిశ్వాస్, మనోజ్ భట్టాచర్య సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దేశ రాజ్యాంగాన్ని, పార్లమెంట్ను, లౌకిక గణతంత్ర రాజ్యాన్ని కాపాడడానికి వామపక్షాలకు ఉన్న నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. రాజ్యాంగ గణతంత్ర వ్యవస్థపై జరుగుతున్న ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు దేశ వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేస్తాయన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించి రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలను రూపొందించాలన్నారు.