Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య పరిరక్షణకై ఇతర పార్టీలతో కలిసి పోరాడుతాం
- రాష్ట్రపతిని కలిసి రాజ్యసభలో జరిగిన పరిస్థితి వివరిస్తాం : మీడియాతో వామపక్ష ఎంపీలు ఎలమారం కరీం, బినరు విశ్వం వెల్లడి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
అగ్రి బిల్లుల అమలుకి కేంద్రంలో మోడీ సర్కారు నియంతత్వంగా వ్యవహరిస్తుందని వామపక్ష ఎంపీలు స్పష్టం చేశారు. పార్లమెంటరీ విలువలు, సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్న దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల రద్దు కూడా ఎటువంటి చర్చ లేకుండా అమలు చేయడం దారుణం అన్నారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలోని సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం తన అధికారిక నివాసంలో సీపీఐ ఎంపీ బినరు విశ్వంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తొలుత కరీం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యయుతంగా ఒక బిల్లుని అమలు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని... అయితే, దానికి పార్లమెంటరీ విధానాలు, సాంప్రదాయాలు అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లు, చట్టంగా రూపొందించేందుకు ప్రతి సభ్యుడికీ ఉన్న హక్కులకనుగుణంగా బిల్లుపై చర్చ చేయడాన్ని చట్టసభలో కోరామన్నారు. కానీ, ప్రభుత్వం పట్టించుకోకుండా నేరుగా బిల్లులను చట్టాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అలా జరిగితే ఇక.. ఈ పార్లమెంట్ ఎందుకు? ఇన్ని విధానాలు ఎందుకు? అని వారు ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రభుత్వం డిప్యూటీ చైర్మెన్ను అడ్డుపెట్టుకొని చేసిన తతంగాన్ని దేశమంతా గమనించిందన్నారు. ఈ అంశంపై తాము ఇతర రాజకీయ పక్షాలతో కలిసి పోరాడుతామన్నారు. ఇదే విషయంపై తాము భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కలుస్తామన్నారు. ఆయనని కలిసి అసలు రాజ్యసభలో ఏం జరిగిందో వివరిస్తామని స్పష్టం చేశారు.
బ్రిటిష్ వారికంటే బీజేపీ సర్కారే భయంకరమైన చట్టాల రూపకల్పన బినరు విశ్వం, సీపీఐ
కేంద్రంలోని అధికార మోడీ ప్రభుత్వం వలసవాదులైన బ్రిటిష్ వారికంటే భయంకరమైన చట్టాలను రూపొందిస్తుందని సీపీఐ ఎంపీ బినరు విశ్వం వెల్లడించారు. లేబర్ కోడ్ బిల్లులు, అగ్రి బిల్లులు అప్పుడు బ్రిటిష్ వారు కార్మిక, కర్షకులకు ఎన్నో హక్కులు, రక్షణలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్లను దృష్టి పెట్టుకొని బిల్లులకు సవరణలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ అంశాలపై తాము రానున్న రోజుల్లో ఆందోళన నిర్వహిస్తామని ఆయన చెప్పారు.