Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టు వ్యయాన్ని 18.8 శాతం పెంచిన కేంద్రం
- తక్కువ బిడ్ వేసినప్పటికీ టాటా సంస్థకు రూ. 86 కోట్లు లాభం
- రూ. 20 వేల కోట్ల భారీ ప్రాజెక్టు దక్కించుకునేందుకు ప్రణాళికలు
స్రవంతి
ఈత గింజ ఇచ్చి తాటి గింజను లాక్కోవడం' అంటే ఇదేనేమో. దేశ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే కాంట్రాక్టును ప్రధాని మోడీ సన్నిహితుడు ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు చెందిన టాటా గ్రూపు సంస్థ 'టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్' దక్కించుకోవడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 940 కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా.. రూ.861.90 కోట్లకే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ కాంట్రాక్టును దక్కించుకున్నది. దాదాపు రూ. 80 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ, టాటా సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు రావడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీయగా రెండు ప్రధాన విషయాలు వెలుగుచూశాయి. ఒకటి కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రాజెక్టు వల్ల టాటా సంస్థకు రూ. 80 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందన్నది అబద్ధం. ఈ ప్రాజెక్టు కారణంగా ప్రభుత్వం నుంచి టాటా సంస్థకే రూ. 86 కోట్ల లాభం చేకూరిందన్నది నిజం. భవిష్యత్లో నిర్మాణం కానున్న రూ.19,060 కోట్ల విలువైన ప్రాజెక్టు (సెంట్రల్ విస్టా) నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకోవడానికి టాటా వ్యూహం రచించినట్టు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల కోసమని తదితర కారణాలు చెబుతూ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని మోడీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో తెరపైకి తీసుకొచ్చింది.
పాత పార్లమెంటు ఆవరణలోనే త్రికోణాకారంలో నిర్మించనున్న ఈ కొత్త పార్లమెంట్ భవనానికి ప్రభుత్వం తొలుత రూ. 776 కోట్లను అంచనాగా పెట్టుకున్నది. అయితే, డిజైన్లో చిన్న మార్పులు చేస్తున్నట్టు ఆ తర్వాత పేర్కొంది. దీంతో బిడ్డింగ్ నిర్వహించే సమయానికి ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 940 కోట్లుగా ( 18.8 శాతం ఎక్కువ) నిర్ణయించింది. దీంతో టాటా గ్రూపు సంస్థ రూ. 861.9 కోట్లకు ప్రాజెక్టును దక్కించుకున్నది. తొలుత ప్రభుత్వం అంచనా వేసిన రూ. 776 కోట్ల వ్యయంతో పోలిస్తే టాటా గ్రూపు రూ. 86 కోట్లను లాభపడిందనే చెప్పాలి. ఏకంగా 18.8 శాతం ఎక్కువ వ్యయం అయ్యేంతగా ప్రాజెక్టులో అంత పెద్ద మార్పులు ఏమి చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి వివరాలు సేకరించడం జరిగింది. అయితే, ఆ డిజైన్ మార్పులు చాలా చిన్నవని తర్వాత తెలిసింది. నూతన పార్లమెంటులో నిర్మించే గదుల వైశాల్యాన్ని కొంచం పెంచడం, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఆధునీకరించడం వంటి కారణాలు చెబుతూ ప్రాజెక్టు వ్యయాన్ని సర్కారు ఏకంగా రూ. 86 కోట్లు పెంచింది. నిజానికి రూ. 750 కోట్లతోనే ప్రతిపాదిత డిజైన్ లో నూతన పార్లమెంటును నిర్మించడంతో పాటు దశాబ్దకాలంపాటు దాని నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టవచ్చని ఆర్కిటెక్ట్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పార్లమెంటు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేస్తే ప్రభుత్వానికి సంబంధించిన 'సెంట్రల్ విస్టా' భారీ కాంట్రాక్టు దక్కించుకోవచ్చని టాటా సంస్థ వర్గాలు భావిస్తున్నట్టు వినికిడి. ప్రభుత్వం కూడా ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును టాటాలకే కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.