Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19తో పలువురు ప్రముఖుల మృతి
- యూపీలో 10 వేల మంది పోలీసులకు కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతున్నది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రోజూ వేయి మందికి పైగా ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 86,508 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,129 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 57,32,519కి చేరింది. మరణాల సంఖ్య 91,149కి చేరింది. ప్రస్తుతం 9,66,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 75 శాతానికి పైగా కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఒడిశా, కేరళ, బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. అలాగే, మరణాలు మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లోనే 83 శాతం చోటుచేసుకున్నాయి. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారమే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో కన్నుమూశారు. ఇదివరకే కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన - బసవకళ్యాణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.నారాయణరావు (65) గురువారం మధ్యాహ్నం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
- అలాగే, ప్రముఖ శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మెన్ శేఖర్ బసు కన్నుమూశారు. అటామిక్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు.
- ఇదిలావుండగా మహారాష్ట్ర పట్టణాభివద్ది శాఖ మంత్రి ఏకనాథ్ షిండే కరోనా బారినపడ్డారు. బుధవారం టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలిందని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 13 మంది మంత్రులు కరోనా బారిన పడ్డారు. అలాగే, ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే పార్టీ స్థాపకులు విజయ కాంత్కు కరోనా వచ్చింది. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకూ 10,142 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు యూపీ డీజీపీ హెడ్ క్వార్టర్స్ వర్గాలు వెల్లడించాయి.
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. రాజ్భవన్లో ఏడీసీ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు తేలడంతో దత్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
మహారాష్ట్రలో 12 శాతం మంది గర్భిణీలకు కరోనా !
మహారాష్ట్రలో రాష్ట్రంలోని మొత్తం గర్భిణీల్లో 12 శాతం మందికి పైగా కరోనా బారినపడ్డారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. మరీ ముఖ్యంగా వీరిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని తెలిపింది. ముంబయికి చెందిన ఐసీఎంఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ (ఎన్ఐఆర్ఆర్హెచ్) పరిశోధకులు ఈ అధ్యయనం జరిపారు. దీని ప్రకారం.. కరోనా సోకిన గర్భిణీలు ఆస్పత్రిలో హాజరయిన సమయంలో 10 మందిలో ఒకరికి ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. రాష్ట్రంలోని 1140 మంది గర్భీణీలపై చేసిన ఈ అధ్యయనంలో 141 మంది వైరస్ బారినపడినట్టు గుర్తించారు. ముంబయిలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న నాయర్ ఆస్పత్రిలో ఉన్న మొత్తం మహిళల్లో 141 మంది గర్భిణీల డేటాను పరిశీలించగా.. వారిలో 11.5 శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయని అధ్యయనం గుర్తించింది. ''గర్భిణీలు సాధారణంగా తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కరోనా బారినపడకుండా గర్భిణీలను రక్షించడం చాలా ముఖ్యం'' అని ఎన్ఐఆర్ఆర్హెచ్ డాక్టర్ దీపక్ మోడీ అన్నారు. పరీక్షలు చేయడం ద్వారనే వీరిని గుర్తించవచ్చనీ, వారికి పుట్టబోయే పిల్లల్ని రక్షించడంతో పాటు వారి ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి వీలవుతుందన్నారు.