Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో కాషాయపార్టీ 'కొత్త' ఎత్తుగడ
- వ్యవసాయ బిల్లులపై రైతుల్లో వ్యతిరేకతను మరుగునపర్చే యత్నం
భోపాల్ : మధ్యప్రదేశ్లో బీజేపీ ఉప ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో కాషాయ పార్టీ నిమగమైంది. కేంద్రంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్నదాతల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలకు గాలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో హడావుడిగా కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. రైతులకు సంబంధించిన ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (ఎంకేఎస్ఎన్) పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ పథకం కింద ఏడాదికి రూ.4000 లు ఆర్థిక సహాయం అందుతాయి.
వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో అన్నదాతల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చి.. ఉప ఎన్నికల్లో వారి ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ఎంకేఎస్ఎన్ను తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. ఈ పథకంతో ఉప ఎన్నికల్లో ఓట్లను పొందడంతో పాటు రైతుల్లో ఆగ్రహజ్వాలలను తగ్గించవచ్చని అధికార పార్టీ భావిస్తున్నది. అయితే రాష్ట్రంలోని రైతులను మరోసారి మోసగించే ప్రయత్నం శివరాజ్సింగ్ ప్రభుత్వం చేస్తున్నదని ప్రతిపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 28 అసెంబ్లీ స్థానాలకు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఎంకేఎస్ఎన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకూ ఏడాదికి రెండు వాయిదాల్లో రూ. 4000 వేలు అందజేస్తుందని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా తొలి వాయిదా ఈనెల 25న రైతులు అందనున్నదని ఆయన వివరించారు. ఫలితంగా రాష్ట్రంలోని 77 లక్షల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందనున్నారని పేర్కొన్నారు. అయితే గత కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన రుణ హామీ పథకాన్ని మరుగునపడేసే విధంగా ఎంకేఎస్ఎన్ పథకంతో బీజేపీ సర్కారు ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. 15 నెలల తన పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 26.90 లక్షల మ ంది రైతులకు రుణమాఫీని చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ.. తన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేలా వ్యూహాలు రచించి అధికారాన్ని చేపట్టిన విషయం విదితమే.
25న రైతు సంఘాల భారీ నిరసనలు
పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదం తర్వాత మోడీ సర్కారుకు వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని భోపాల్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాల నాయకులు కదంతొక్కారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని భారతీయ కిసాన్ సంఫ్ు, భారతీయ కిసాన్ మజ్దూర్ సంఫ్ులు హెచ్చరించాయి. ఎన్నికలు వస్తేనే బీజేపీకి రైతులు, కొత్త కొత్త పథకాలు గుర్తుకు వస్తాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వాగ్దానాలను నమ్మే స్థితిలో తాములేమని ఆ రెండింటితో పాటు ఇతర రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆరెస్సెస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఫ్ు.. సీఎంను కలవడం గమనార్హం.