Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం కార్పొరేటు విధానాలకు ప్రత్యామ్నాయం
- సమిష్టి వ్యవసాయ బలోపేతానికి అడుగులు
- రైతు సహకార సంఘాలు, కమ్యూనిటీ నెట్వర్క్ల భాగస్వామ్యమే లక్ష్యం
- ఇప్పటికే కుటుంబశ్రీ కార్యక్రమంతో మహిళా రైతులకు చేయూత
దేశంలోని రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం కార్పొరేట్ల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. లోక్సభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం అనంతరం రాజ్యసభలోనూ బిల్లులు పాస్కావడంతో దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న నిరసన దినం పాటించబోతున్నారు. ఈ బిల్లులను ప్రతిపక్షాలు, అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యతిరేకించినప్పటికీ అధికార బలంతో మోడీ సర్కారు ఈ బిల్లులను ఆమోదింపచేసుకొని వ్యవసాయ రంగంలో కార్పొరేట్లరాకకు మార్గం సుగమమం చేసిందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్రిబిల్లులను కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించడానికి కేరళ సర్కారు సిద్దమవుతున్నది.
తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వ వివాదా స్పద వ్యవసాయరంగ సంస్కరణలను ఎదుర్కొనేం దుకు కేరళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని భావిస్తున్నది. సహకార సంఘాలు, రైతులను భాగస్వామ్యం చేస్తూ కుటుంబశ్రీ కార్యక్రమం తీరులో రాష్ట్రంలో సమిష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీని ద్వారా రైతులు తాము పండించే పంటకు గిట్టుబాటు ధరను పొందుతారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విఎస్ సునీల్ కుమార్ సైతం స్పష్టం
చేశారు. వ్యవసాయరంగంలో కార్పొరేట్లను ఎదుర్కోవడం కోసం సహకార సంఘాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని రాష్ట్రంలో తాము అమలు చేయబోతున్నామని మంత్రి చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు కేరళ వంటి రాష్ట్రాన్ని తీవ్ర అగాథంలోకి నెడుతుందని ఆయన అన్నారు. ''దేశంలో అన్నం పెట్టే అన్నదాత ఆకలికి అలమటిస్తున్నాడు. ఇప్పటికే అమలులో వున్న ఉన్న ఎగుమతి విధానాలు దేశంలో అనేక మంది రైతుల ఆత్మహత్యలకు దారి తీశాయి. అంతటితో ఆగకుండా కేంద్రం.. రైతులపై ఏ మాత్రం దయ చూపకుండా కార్పొరేట్లకు మేలు చేకూర్చే మరో అడుగును వేసింది. దీంతో రైతుల సంక్షేమం కోసం ప్రస్తుతం ఉన్న మిగతా కొన్ని నిబంధనలు తుడిచిపెట్టుకుపోతాయి'' అని సునీల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత బిల్లుల కంటే ముందుగా కేంద్రం.. స్వామినాథన్ కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది జులైలో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తీసుకొచ్చిన కాంట్రాక్టు వ్యవసాయ ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం ఆ సమయంలోనే తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారిన తాజా వ్యవసాయ సంస్కరణలను రాష్ట్రం తప్పుబట్టింది. రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ విధానంలో రైతు సహకార సంఘాలు, కమ్యూనిటీ నెట్వర్క్స్ను ప్రోత్సహించాలని కేరళ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో సమిష్టి వ్యవసాయానికి బాటలు వేయాలని భావిస్తున్నది. స్థానిక రైతులు పండించే పంటలకు చక్కటి ధరలు కల్పించేలా ఈ సహకార సంఘాలు కృషి చేస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతమైన సహకార సంఘాలు అనేకం ఉన్నాయి. ఇందుకు వయనాడ్ జిల్లాలోని బ్రహ్మగిరి డెవలప్మెంట్ సొసైటీ(బీడీసీ) ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ బీడీఎస్ను 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ సహకార సంఘం స్థానిక పంచాయతీలతో కలిసి పనిచేస్తుంది. దీని ద్వారా ఎంతో మంది రైతులు తాము పండించే పంటకు గిట్టుబాటు ధరను పొందగలుగుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగంగా 13,500కు పైగా కుటుంబాలు భాగంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సహకార వ్యవసాయ వ్యవస్థను రాష్ట్రంలో అమలవుతున్న కుటుంబశ్రీ కార్యక్రమంలోలాగే నిర్వహించాలని భావిస్తున్నది. అయితే ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం ఉద్దేశించినది. సమిష్టి వ్యవసాయంలో భాగమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్(ఎస్పీఈఎం) 1997లో ప్రవేశపెట్టింది. దీంతో ఎంతో మంది భూమిలేని మహిళలు ఈ పథకం ద్వారా లీజుకు భూమిని పొంది వ్యవసాయం చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నది. ఇప్పటికే ఎంతో మంది మహిళలు దీని ద్వారా సాధికారికతతో పాటు సమాజంలో పురుషులతో సమానంగా గౌరవాన్ని పొందగలుగుతున్నారు.