Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.4 లక్షల కోట్లు ఆవిరి
- అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు
- వెంటాడుతున్న కరోనా భయాలు
- ప్రధాన రంగాలన్నీ 4 శాతం ఢమాల్
- సెన్సెక్స్ 1100 పాయింట్లపైగా ఫట్
- బోరుమన్న మదుపరి
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీపై తీవ్ర అనుమానాలకు తోడు కరోనా కేసుల విజృంభణ సెన్సెక్స్, నిఫ్టీలను భారీగా కృంగేలా చేశాయి. గురువారం సెషన్లో నష్టాలతో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 1114.82 పాయింట్లు పతనమై 36,553.60కు పడిపోయింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్ను సైతం కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 326.30 పాయింట్లు కోల్పోయి 10,805.55 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు జారింది. దీంతో రెండు సూచీలు కూడా వరుసగా ఆరో సెషన్లోనూ నష్టపోయినట్టయ్యింది. నిఫ్టీలో అన్ని రంగాలు నేల చూపులు చూడగా.. సెన్సెక్స్-30లో కేవలం ఒక్క హెచ్యుఎల్ మాత్రమే స్వల్పంగా లాభపడింది. ఒక్క సెషన్లోనే మదుపర్ల సంపద రూ.3.91 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోవడంతో బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.148.79 లక్షల కోట్లకు పడిపోయింది. వరుస లాభాల్లో ఉన్న రిలయన్స్ ఇండిస్టీస్ సూచీ 2.12 శాతం నష్టపోయింది.
ప్రతికూలాంశాలు..
కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుందని ఫెడరల్ రిజర్వ్ చైర్మెన్ జెరోమ్ పావెల్ అన్నారు. దీంతో ప్రభుత్వం మరింత అధికంగా ఆర్థిక మద్దతును అందించవలసి ఉందన్నారు. ఇటీవల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై నిపుణులు వరుసగా ఆందోళన వ్యక్తం చేయడం, తాజాగా పావెల్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత సూచీల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. భారత్లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు, దేశ జీడీపీ రికవరీ చాలా నెమ్మదిగా ఉండొచ్చన్న విశ్లేషణలు సెన్సెక్స్, నిఫ్టీలను నేల చూపులు చూసేలా చేశాయి. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపర్లు షేర్లను తెగనమ్ముకోవడంతో గత కొన్ని సెషన్ల నుంచి సూచీలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. యూరప్లోనూ కరోనా వైరస్ రెండో దఫా విస్తరించడంతో మరోసారి లాక్డౌన్ విధించడానికి ఆయా దేశాలు సిద్ధం అవుతున్నాయనే సంకేతాలు విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత మాంద్యంలోకి నెట్టివేయవచ్చన్న అంచనాలు పెరిగాయి. దేశీయంగా చైనాతో సైనిక వివాదాలు కూడా ఎటు వైపు దారి తీస్తాయో అనే అనుమానాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడం కూడా అమ్మకాలకు దారి తీసింది. కాగా బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ.3,912 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. మూడు సెషన్లలో దాదాపుగా రూ.6660 కోట్ల పైగా వెనక్కి తరలించుకుపోయారు.