Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారించనుంది. దేశంలో కోవిడ్-19 సంక్షోభం, వరద పరిస్థితుల నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షను 2-3 నెలలు వాయిదా వేయాలని సివిల్స్ అభ్యర్థులు 20 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అక్టోబర్ 4న పరీక్షను నిర్వహించాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్ణయానికి వ్యతిరేకంగా యూపీఎస్సీ ఆశావాహులు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై యూపీఎస్సీ, కేంద్రం స్పందన కోరుతూ ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 28కి విచారణ వాయిదా వేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష మే 31వ తేదీనే జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా పరీక్ష వాయిదా పడింది. జూన్ 6న యూపీఎస్సీ పరీక్ష కొత్త తేదీని ప్రకటించింది. అక్టోబర్ 4న పరీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
కరోనా విజృంభణ, వరదలు, రవాణా సౌకర్యాల కొరత నేపథ్యంలో ఇదివరకే సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులు యూపీఎస్సీకి.. పరీక్షలు వాయిదా వేయాలంటూ లేఖలు రాశారు. అయితే, యూపీఎస్సీ పరిక్షను నిర్వహించడానికే మొగ్గుచూపడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్ ఎమ్.ఖాన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడా ధర్మాసనం ఈ పిటిషన్ను ఈ నెల 28న విచారించనుంది.