Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతను వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్ర
- కార్పొరేట్లకు మోడీ సర్కార్ ఊడిగం
- కొత్త బిల్లులతో రైతులకు మేలంటూ అబద్ధపు ప్రచారం
- మోడీది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. బిల్లులను పార్లమెంట్కు తిరిగి పంపించాలి : ఢిల్లీ ధర్నాలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కార్ రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా విమర్శించారు. మోడీ సర్కార్ రైతుల వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. ఈ మూడు బిల్లులతో రైతులకు మేలు అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా ఆమోదం పొందిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించకుండా.. వెనక్కి పంపాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంట్లో అప్రజాస్వామికంగా ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆలిండియా కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) నేతృత్వంలో సుమారు 250 సంఘాలు సంయుక్తంగా శుక్రవారం భారత్ బంద్కు పిలుపిచ్చాయి. అందులో భాగంగానే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ ఆందోళనకు వామపక్ష ఎంపీలు కెకె రాగేష్, వికాష్ రంజన్ భట్టాచార్య (సీపీఐ(ఎం)), బినరు విశ్వం (సీపీఐ), సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు సంఘీభావం తెలిపారు. అలాగే సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎంఎం తదితర ప్రజా సంఘాలు ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాల నేతలు మూడు రైతు వ్యతిరేక బిల్లులకు సంబంధించిన ప్రతులను చించి నిరసన తెలిపాయి .రైతు విరోధి బిల్లులు వెనక్కి తీసుకోవాలి. కార్పొరేట్ల నుంచి రైతులకు స్వేచ్ఛ కావాలి. వ్యవసాయ బిల్లుల నుంచి విముక్తి కావాలి. కార్పొరేట్ లూటీ, బహుళజాతి కంపెనీల, డబ్ల్యూటీఓ నుంచి రైతులకు ఆజాదీ కావాలి. రైతులకు రుణ మాఫీ చేయాలి. రైతులు పండించే పంటకు ఎంఎస్పీ కల్పించాలి.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతం హౌరెత్తింది.
ఇది అంతం కాదు ఆరంభమే.. : హన్నన్ మొల్లా, ఏఐకేఎస్
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని రైతాంగమంతా రోడ్లపైకి వచ్చారని, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. ఇదే మోడీ సర్కార్ గతంలో భూ సేకరణ బిల్లును తీసుకొచ్చిందనీ, అప్పుడు కూడా రైతులు రోడ్లపైకి వచ్చారని గుర్తు చేశారు. రైతుల వద్ద భూములు గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఇపుడు తాజాగా బిల్లులను తీసుకొచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు మూడు బిల్లులను తీసుకొచ్చి రైతుల నుంచి వ్యవసాయాన్ని దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), రుణ మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచేందుకు బిల్లులను తీసుకొచ్చారని విమర్శించారు. అదానీ, అంబానీల సొమ్ముతో ప్రధాని మోడీ, వారి లాభాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఏసీ గదుల్లో ఉన్న అదానీ, అంబానీలకు రైతుల సమస్యల గురించి తెలుసా..? వారితో సామాన్య రైతులు బేరమాడే శక్తి ఉంటుందా? అని ప్రశ్నించారు.
సుప్రీం కోర్టులో బిల్లులపై కేరళ సర్కార్ సవాల్
రైతు వ్యతిరేక బిల్లులపై కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు నిర్ణయం తీసుకుందని హన్నన్ మొల్లా తెలిపారు. 70 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మోడీ సర్కార్ అంత రైతు విరోధి మరెవ్వరూ లేరని వివరించారు. మోడీ మూడు ఎన్నికల సభల్లో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చారనీ, ఆరేండ్లు గడుస్తున్నా..అతీగతీలేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తే, ఆరుగురు రైతులను కాల్చారని గుర్తు చేశారు. ఈ ఆందోళనలో తపన్ సేన్, హేమలత, జెఎస్ మజుందర్, ఎఆర్ సింధూ (సీఐటీయూ), విజూ కష్ణన్ ( ఏఐకేఎస్), ప్రేమ్ సింగ్, పురుషోత్తం (ఏఐకేఎం), మరియం ధావలే, ఎస్.పుణ్యవతి, ఆశాశర్మ (ఐద్వా), మయూక్ బిశ్వాస్ (ఎస్ఎఫ్ఐ), అనీరాజా (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), జి. మమత (డీఎస్ఎంఎం) తదితరులు పాల్గొన్నారు.
రైతాంగంపై మోడీ సర్కార్ యుద్ధం ః బివి. రాఘవులు
దేశంలోని రైతాంగంపై మోడీ సర్కార్ యుద్ధం ప్రకటించిందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఈ బిల్లులతో దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు రైతుల నడ్డి విరగొట్టిందని విమర్శించారు. రైతుల కోసమే చేశామనీ, పండిన పంటను ఎక్కడైన అమ్ముకోవచ్చని మోడీ, ఆయన మంత్రులు చెబుతున్నారనీ, కానీ వాస్తవానికి దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుతోందని వివరించారు. కనీస మద్దతు ధరను రద్దు చేయడానికి పన్నే కుట్రలో భాగంగానే ఈ బిల్లులను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మార్ట్ వంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలోకి వస్తే, గిట్టుబాటు ధర అడిగే ఆస్కారం ఉండదన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)ని కూడా నాశనం చేస్తారనీ, ఆహార భద్రత పూర్తిగా నిర్వీర్యమవుతున్నదని తెలిపారు. హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఓటేసిన రైతులే, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు బూటకమని రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తున్నారని అన్నారు. హౌల్సేల్ దొంగలను రైతాంగంపై దింపుతోందని విమర్శించారు. ఈ బిల్లులను ఉపసంహరించుకోకపోతే దేశానికే వెన్నెముక అయిన రైతాంగం ఆగ్రహజ్వాలల్లో మోడీ సర్కార్ మట్టికొట్టుకుపోతుందని హెచ్చరించారు. ప్రయివేటు విద్యుత్ సంస్థలను ఒత్తిడితో విద్యుత్ పంపిణీ ప్రయివేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్ సిద్ధపడుతున్నారని విమర్శించారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. ప్రభుత్వ వైఖరి రైతులు సామూహికంగా ఆత్మహత్యలు జరిగేందుకు ఆస్కారం కలిగిస్తున్నదనీ, బీజేపీ ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదని అన్నారు. ఎన్డీఏ సర్కారు కేవలం పెద్ద పెద్ద ప్రయివేటు విద్యుత్ సంస్థలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను అప్పగించేపనిలో పడిందని విమర్శించారు. రైతుల ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు.
రైతుల ఆందోళనకు చారిత్రక స్పందన
దేశంలోని రైతులు చేపట్టే ఆందోళనకు చారిత్రక స్పందన లభించింది. చాలా రాష్ట్రాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రైల్వే లైన్లు దిగ్భందనం, మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా రాష్ట్రాల్లో భారీసంఖ్యలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అన్ని రాష్ట్రాల్లో కార్మికులు, విద్యార్థులు, యువకులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసులు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. పంజాబ్, హర్యానాల్లో పూర్తి స్థాయి బంద్ జరిగింది. రాజస్థాన్, కర్నాటకలోనూ ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పశ్చిమ బెంగాల్లో 92 ప్రాంతాల్లో జాతీయ రహదారులు, 89 రాష్ట్ర రహదారులను దిగ్భందించారు. బెంగాల్లో ఆరు లక్షల మంది రైతులు పాల్గొన్నారు.
కేరళలో 250 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు ఎస్.రామచంద్రన్ పిళ్లై పాల్గొన్నారు. త్రిపురలో ఆందోళన తీవ్రస్థాయిలో కొనసాగితే..ఆందోళనకారులపై పోలీసులు దాడికి దిగారు. మహారాష్ట్రలోనూ నిరసనల సెగలు తాకాయి. ధనూ, పాలఘర్ జిల్లాల్లో ముంబయి, ఢిల్లీ రహదారిని వేలాది మంది రైతులు దిగ్భందించారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే పాల్గొన్నారు. తమిళనాడులో వందలాది ప్రాంతాల్లో అన్ని రైతు సంఘాలు సంయుక్తంగా ఆందోళన నిర్వహించాయి. ఆందోళన చేస్తోన్న రైతులకు వ్యతిరేకంగా పోలీసులు చర్యలు చేపట్టారు. బీహార్, జార్ఖండ్లో రైతులు, కార్మికులు అన్ని జిల్లాల్లో రోడ్లు, రైల్వే మార్గాలు దిగ్భందించారు. ఒడిశా, అసోం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ల్లో చాలా ప్రాంతాల్లో రైతులు, కార్మికులు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను, బిల్లు ప్రతులను దహనం చేశారు.