Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాసెసింగ్ ఫీజు రద్దు
- రిటైల్, గృహ రుణాలకు వర్తింపు
- రుణగ్రహీతలకు పలు బంఫర్ ఆఫర్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ రుణ గ్రహీతలకు పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుత పండగ సీజన్లో తమ వినియోగదారులకు అందించే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఆ వివరాలు.. ఎస్బీఐ యోనో యాప్లో వాహన, బంగారం, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసే ఖాతాదారులకు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. ఆమోదం లభించిన ప్రాజెక్టుల్లో నివాసాలు కొనుగోలు చేసేవారి గహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజునూ 100 శాతం రద్దు చేసింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసిన రుణగ్రహీతలకు వడ్డీ రేట్లలో 10 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ కల్పించనున్నట్టు ప్రకటించింది. అదే విధంగా యోనోపై గృహ రుణానికి దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా వడ్డీరేటుపై మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని కల్పిస్తుంది. సొంత కారు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి 7.5 శాతం వడ్డీకే అప్పు ఇవ్వనున్నట్టు తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన వాహనాలపై ఏకంగా 100 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పించినట్టు పేర్కొంది. బంగారం రుణాలకు దరఖాస్తు చేసుకునే వారికి 7.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల్లోగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసే కారు, గృహ రుణాల దరఖాస్తులకు వేగంగా ఆమోదం తెలుపుతామని ఎస్బీఐ పేర్కొంది. పండగ సీజన్లో ప్రజలు ఉత్తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేం దుకు తమ వంతు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో ఈ రాయితీలను కల్పిస్తున్నట్టు ఎస్బీఐ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ శెట్టి తెలిపారు.