Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రి బిల్లులపై మిన్నంటిన రైతుల ఆందోళనలు
- ఢిల్లీలో ట్రాక్టర్ దహనం
- దద్దరిల్లిన తమిళనాడు
- భగత్ సింగ్ చిత్ర పటాలతో పంజాబ్ రైతుల నినాదాలు
- నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన అమరీందర్ సింగ్
- కర్నాటకలో కర్షకుల కదనం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రైతు వ్యతిరేక బిల్లులపై సోమవారం దేశంలో రైతాంగం ఆగ్రహించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను నిరసిస్తూ నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటాయి. ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, త్రిపుర, గోవా, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నియోజకవర్గమైన వారణాసిలో బిల్లులతో పాటు ప్రయివేటుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. షాహిద్ భగత్సింగ్ 113వ జయంతిని పురస్కరించుకొని దేశ రాజధాని హస్తినలో ఆందోళనలు హోరెత్తాయి. ఢిల్లీలో ఇండియా గేట్ సాక్షిగా రైతుల అగ్నిజ్వాల ఎగిసింది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర హౌం, ఆర్థిక, రక్షణ, రైల్వేమంత్రిత్వ శాఖల కార్యాల యాలకు సమీపం(కూతవేటు దూరంలోనే)లో ఇండియా గేట్వద్ద పంజాబ్కు చెందిన రైతులుట్రాక్టర్ను దహనం చేశారు. భగత్సింగ్ చిత్ర పటాలను చేతబూని మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాం తంలో ట్రాక్టర్ దహనం ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయగా, కాలిపోయిన వాహనాన్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించి ఐదుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
కర్నాటకలో కర్షకుల కదనం
బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బంద్ నిర్వహించాయి. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆలిండియా కిసాన్ మహాసభ (ఏఐకేఎస్)తో పాటు 108 రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. అన్ని జిల్లాల్లో బంద్ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనల్లో కార్మికులు, రైతులు, రైతు కూలీలు, ఇతర అనుకూల ఆందోళనకారులు, దళిత సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. చాలా జిల్లాల్లో వందలాది మంది రైతులు, ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనలు కర్నాటక భూ సంస్కరణల చట్టం, కర్నాటక అసెంబ్లీ ఆమోదించిన వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీ చట్టానికి చేసిన రెండు సవరణలకు వ్యతిరేకంగా జరిగాయి. వేలాది మంది రైతులు బెంగళూరు వీధుల్లోకి వచ్చారు. మైసూరు బ్యాంక్ సర్కిల్ వద్ద, బెంగళూరులోని టౌన్హాల్ ముందు వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటామని కర్నాటక ప్రభుత్వం హెచ్చరించినా రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.
దద్దరిల్లిన తమిళనాడు: రైతులు, ప్రతిపక్షాల ఆందోళనలతో తమిళనాడు రాష్ట్రం దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ద్రవిడ మున్నెట కజగం (డీఎంకే) నేతృత్వంలో నిరసనలు హౌరెత్తాయి. దీనికి రాష్ట్రంలోని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. గ్రామీణ ప్రాంతాలు సహా 3500 కేంద్రాల్లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. రాష్ట్రంలోని పాలక పార్టీ ఈ బిల్లులకు మద్దతు తెలపడంతో రాష్ట్రంలో రైతుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతం అయ్యాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కాంచీపురంలోని కీజాంబి గ్రామంలో జరిగిన రైతు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రమైన కేరళ, పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని యోచిస్తోందని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే విధంగా చేయమని తాము కోరుతున్నామని అన్నారు. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు దీనిపై కోర్టును ఆశ్రయిస్తాయని స్టాలిన్ చెప్పారు. రైతు అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి, పదే పదే తన నేపథ్యాన్ని చెప్పుకునే ప్రధాని.. ఇరువురు కలిసి రైతులపై దాడికి దిగారని ఆరోపించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని రైతుల నుంచి దూరం చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ, దేశంలో మోడీ పాలనకు బదులు కార్పొరేట్ పాలన సాగుతుందంటూ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమైన వస్తువుల జాబితా నుంచి ప్రధాన ఆహార ధాన్యాలను తొలగించటం వల్ల మాస్ హౌర్డింగ్ను ప్రొత్సహిస్తుందనీ, ఫలితంగా కృత్రిమ డిమాండ్ ఏర్పడుతుందన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి నిరవధిక నిరాహార దీక్ష
పంజాబ్, హర్యానాల్లో భారీ స్థాయిలో ఆందోళనలు హౌరెత్తుతున్నాయి. ఖాట్కర్ కలాన్లో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ట్రాక్టర్ దహనం చేయడం ప్రజల కోపాన్ని ఈ ఘటన ప్రస్పుటింపజేస్తుందన్నారు. అమృత్సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్పై రైతుల ఆందోళన కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలను, రైతులను పోలీసలు అరెస్టు చేశారు. వారణాసిలోనూ ఆందోళనలు జరిగాయి. గోవాలో రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టారు. ఒడిశాలో రైతులు, కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ సమీపంలో ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ఆందోళనకారులు రాజ్ భవన్ దగ్గర గుమిగూడి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.