Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచనాలు పెంచిన ఇక్రా రేటింగ్స్..
న్యూఢిల్లీ : భారత జీడీపీ రెండంకెల పతనాన్ని చవి చూడనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి 11 శాతం ప్రతికూల పతనాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయని సోమవారం ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనాలు 9.5 శాతంగా వేసింది. ద్వితీయ త్రైమాసికంలోనూ దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అనేక ఏజెన్సీలు ఇప్పటికే రెండంకెల క్షీణత ఉండొచ్చని రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెప్టెంబర్తో ముగిసే ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ 12.4 శాతం ప్రతికూలతను ఎదుర్కొవచ్చని ఇక్రా పేర్కొంది. మూడో త్రైమాసికంలో 5.4 శాతం పడిపోనుందని.. తిరిగి నాలుగో త్రైమాసికంలో మాత్రం 1.3 శాతం పెరుగుదలను సాధించవచ్చని అంచనా వేసింది. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ 23.9 శాతం పతనం అయిన విషయం తెలిసిందే. మిగతా ఆర్థిక కార్యకలాపాలతో పోల్చితే నిర్మాణం, వాణిజ్యం, ట్రాన్స్పోర్ట్, హోటల్స్, కమ్యూనికేషన్స్, సర్వీసెస్ తదితర రంగాలు పుంజుకోవడానికి దీర్ఘకాలమే పట్టొచ్చని ఇక్రా ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ ఆదితి నయ్యర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జీడీపీ గణంకాలు ఇది వరకు ఎప్పుడూ లేనంత పేలవంగా నమోదు కానున్నాయన్నారు.