Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కీలక నివేదికను సమర్పించింది. సుశాంత్ మృతిని సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్ వైద్య బందం సీబీఐకి పోస్టుమార్టంపై తుది నివేదికను మంగళవారం అప్పగించింది. మృతదేహంలో ఎలాంటి విషపదార్థాలు లేవని స్పష్టం చేసింది. సుశాంత్ సింగ్ది ఆత్మహత్యేనని, ఉరి వేసుకోవడంతోనే చనిపోయాడని ఎయిమ్స్ వర్గాలు ఆ నివేదికలో ధ్రువీకరించాయి. సుశాంత్ మృతదేహంలో అవయవాలను, డీఎన్ఏను పూర్తిగా పరిశీలించామనీ, తర్వాతే ఈ నివేదిక ఇచ్చామని ఎయిమ్స్ తెలిపింది. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఎయిమ్స్ నివేదిక అందుకున్న సీబీఐ అధికారులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఫోరన్సిక్ రిపోర్టు కోసం సీబీఐ ఎదరు చూస్తోంది.
మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాను పంపిన ఫొటోలను చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. కాగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తి ముంబై హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో రియాకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. రియా డ్రగ్స్ వాడిందని ఎన్సీబీ అభియోగాలు మోపింది. ఆమెకు డ్రగ్స్ స్మగ్లర్స్తో సంబంధాలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన ఎన్సీబీ మరింతమందిని విచారించేందుకు సిద్ధమవుతోంది.