Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ ఆదాయం 48శాతం పెరుగుదల
- తెలుగు రాష్ట్రాల వారూ పోగేశారు
- 62 మంది ఆస్తులు రూ.2.45 లక్షల కోట్లు
- మురళి దివి సంపద రూ.49,200 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా దెబ్బకు కోట్లాది సాధారణ ప్రజల ఆదాయం సన్నగిల్లిపోగా... పెట్టుబడిదారుల సంపదకు మాత్రం రెక్కలు వచ్చాయని ఓ తాజా రిపోర్ట్లో స్పష్టమయ్యింది. ముకేశ్ అంబానీ అయితే లాక్డౌన్ కాలంలోనూ రికార్డ్ స్థాయిలో ఏకంగా గంటకు రూ.90 కోట్లు సంపాదించారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్తో కలిసి హురున్ రీసెర్చ్ ఇన్స్ట్యూట్ భారతదేశంతో అపర కుబేరులకు సంబందించిన జాబితాను మంగళవారం విడుదల చేసింది.
ఇరు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2020లో భారత్లోని కుబేరులతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సంపన్నుల వివరాలను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అత్యధిక విలువ కలిగిన 62 కుటుంబాల సంపద రూ.2,45,800 కోట్లుగా ఉంది. ఏడాదికేడాదితో పోల్చితే వీరి సంపద 34 శాతం పెరిగింది. 2020 ఆగస్టు 31 నాటికి వీరి సంపదను డాలర్ మారకపు విలువతో లెక్కించారు. వీరి మొత్తం సంపదలో 32 శాతం కూడా ఔషద ఉత్పత్తుల రంగాల వారిదే కావడం విశేషం. టాప్10లో రూ.49,200 కోట్ల అత్యధిక సంపదతో దివి ల్యాబరేటరీస్కు చెందిన మురళి దివి, ఆయన కుటుంబ సభ్యులు అగ్రస్థానంలో ఉన్నారు.
ఏడాదికేడాదితో పోల్చితే వీరి సంపద 89 శాతం పెరిగింది. హెటిరో డ్రగ్స్ యాజమాని బి పార్థసారథి రెడ్డి రూ.13,900 కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీకి చెందిన సతీష్ రెడ్డి ఉన్నారు. పి పిట్చీ రెడ్డి (4), పివి క్రిష్ణా రెడ్డి (5), జివి ప్రసాద్ అండ్ అనురాధ(6), జూపల్లి రామేశ్వర్రావు (7), ఎం సత్యనారాయణ రెడ్డి (8), విసి నన్నపనేని (9), సి విశ్వేశ్వర రావు అండ్ ఫ్యామిలీ (10) వరుస స్థానాల్లో నిలిచారు.
రూ.2.80 లక్షల కోట్లు పెరిగిన ముకేశ్ సంపద
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2020లో ముఖేష్ అంబానీ రూ.658 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. లాక్డౌన్ కాలంలోనూ ఆయన సంపద గంటకు రూ.90 కోట్లు పెరిగింది. 63 ఏళ్ల ఈ వ్యాపార కుబేరుడి సంపద వరుసగా తొమ్మిదో ఏడాదిలోనూ రూ.2.77 లక్షల కోట్లు పెరిగి రూ.6,58,000 కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండిస్టీస్ను రుణ రహిత కంపెనీగా మార్చడానికి జియో ప్లాట్ఫామ్, రిటైల్లో వాటాల విక్రయం ద్వారా అంతర్జాతీయ కంపెనీల నుంచి ముఖేష్ భారీగా నిధులు సమీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ అత్యధిక ధనవంతుల్లో ముకేశ్ ఐదో స్థానంలో ఉన్నారు. రూ.1.43 లక్షల కోట్లతో హిందూజా బ్రదర్స్ రెండో స్థానంలో, హెచ్సీఎల్కు చెందిన శివనాడర్ ఫ్యామిలీ రూ.1.41 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. గౌతం అదాని సంపద ఒక్క ఏడాదిలోనే 48 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరడంతో నాలుగో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. అజీం ప్రేమ్జీ రూ.1.14 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. డిమార్ట్ రాధాక్రిష్ణన్ దమానీ సంపద 56 శాతం పెరిగి రూ.87,200 కోట్లకు చేరడంతో టాప్ 10 ధనవంతుల్లో ఒక్కరిగా నిలిచారు.
ఐదేండ్లలో మూడు రెట్లు పెరిగారు..
హురన్ లిస్ట్లో రూ.1000 కోట్ల పైబడిన సంపద కలిగిన 828 మంది కుబేరులను గుర్తించింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఈ స్థాయి కుబేరుల్లో మూడు రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. ఈ 828 మందిలో 627 మంది సంపదలో పెరుగుదల నమోదు కాగా.. 229 మంది సంపదలో తగ్గుదల చోటు చేసుకుంది. ఇది వరకు జాబితాలో చోటు సంపాదించుకున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాది జాబితాలో కొత్తగా 162 మంది చేరారు. మొత్తం జాబితాలో 40 ఏళ్ల లోపు వారు 21 మంది ఉన్నారు. దేశ వ్యాప్త జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి గతేడాది 5 మంది బిలియనీర్లు ఉంటే.. ఈ ఏడాది ఆ సంఖ్య 9కి చేరింది.