Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాపై భారత్ కక్ష సాధింపు చర్యలు
- అందుకే ఇక్కడ మా కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన
- బ్యాంకు ఖాతాలు స్తంభింపచేశారని ఆరోపణ
- ఢిల్లీ అల్లర్లు, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని అడిగినందుకే వేధింపులు
న్యూఢిల్లీ : భారత్ లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. భారత ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపింది. ఈ నెల పదో తేదీ నుంచి తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)స్తంభింపజేసిందని చెప్పింది. నిరాధారమైన, ఉద్దేశపూరిత ఆరోపణలపై భారత ప్రభుత్వం మానవహక్కుల సంస్థలపై దాడి చేయడం ప్రారంభించిందని ఆమ్నెస్టీ పేర్కొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో తమ సిబ్బందిని తొలగించాల్సి వచ్చిందనీ, తమ సంస్థ ప్రచారాలనూ, పరిశోధనా కార్యక్రమాలన్నిటినీ నిలిపేయాల్సి వచ్చిందనీ అమ్నెస్టీ తెలిపింది. 'భారత్లో మేం ఓ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం నుంచి ఒక క్రమపద్ధతిలో బెదిరింపులు, దాడులు, వేధింపులను ఆమ్నెస్టీ ఎదుర్కొంటున్నది' అని ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, అడ్వకసీ అండ్ పాలసీ రజత్ ఖోస్లా అన్నారు. 'మానవ హక్కులను పరిరక్షించేందుకు మేం చేస్తున్న కృషిలో భాగంగా ఢిల్లీ అల్లర్ల విషయంలో, జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న విషయాలపై లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇష్టపడని కేంద్రప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకూ, దాడులకూ పాల్పడుతున్నది' అని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆమ్నెస్టీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేసి ఏడాది గడిచిన సందర్భంగా నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విలేకరులను విడుదల చెయ్యాలనీ, అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాలని కూడా ఆమ్నెస్టీ డిమాండ్ చేసింది. దేశంలో అసమ్మతిని కాలరాస్తున్నారని ఆరోపించింది. దీంతో అప్రజాస్వామికంగా తమ ఖాతాలను సీజ్ చేసిందని ఆమ్నెస్టీ సంస్థ డైరెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. కాగా, గత రెండు సంవత్సరాలుగా ఆమ్నెస్టీ కార్యకలాపాలు రద్దు చేయడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే దాడి చేసేందుకు ఈవిధంగా చేసిందని ఆమ్నెస్టీ పేర్కొంది. ఆమ్నెస్టీ సంస్థ గత కొన్నేండ్లుగా ప్రభుత్వసంస్థల సోదాలను ఎదుర్కొంటున్నదనీ, ఈ నెలలో బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయటం పరాకాష్టగా అని తెలిపింది. విదేశీ నిధులకు సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందనే ఆమ్నెస్టీపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. కాగా, 'అది పచ్చి అబద్దం. ఆమ్నెస్టీ ఇండియా.. దేశీయ, అంతర్జాతీయ చట్టపరమైన నిబంధలన్నిటినీ కచ్చితంగా అనుసరిస్తున్నది' అని ఖోస్లా తెలిపారు.
వేధింపులు ఇలా...
2016లో ఓ కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఆమ్నెస్టీపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మూడేండ్ల తరువాత కోర్టు ఆ అభియోగాలను తొలగించాలని ఆదేశించింది. 2018లో బెంగళూరులో ఆమ్నెస్టీ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అప్పుడు ఆర్థిక నేరాల పేరుతో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అయితే కోర్టు జోక్యంతో మళ్లీ వాటిని పునరుద్ధరించారు. 2019 చివర్లో మరోసారి ఆమ్నెస్టీ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది. ఇటీవల ఆమ్నెస్టీకి సంబంధించిన అన్ని అకౌంట్లను ప్రభుత్వం సీజ్ చేసింది.