Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షయ రోగులకు కరువైన వైద్యం
- ఈ ఏడాది 4 లక్షల టీబీ మరణాలు సంభవించవచ్చని అంచనా
- ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇప్పటికే యావత్ ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. దీంతో అత్యవసర ఆరోగ్య సేవలకు తీవ్రస్థాయిలో అటంకం ఏర్పడింది. మరీ ముఖ్యంగా టీబీ రోగుల పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. వీరికి వైద్యం అందించకపోతే మరణాలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) నివేదిక హెచ్చరించింది. క్షయ వ్యాధి రోగులను గుర్తించడంతో పాటు, వారికి వైద్యం అందించడం కోసం మెరుగైన ప్రణాళికలను వెంటనే రూపొందించాలని సూచించింది. డబ్ల్యూహెవో విడుదల చేసిన 'గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్టు 2020' నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్లో టీబీ కేసుల నోటిఫికేషన్లో భారత్ 85 శాతం తగ్గుదల నమోదుచేసింది. అంటే ఈ ఏడాది జనవరి వరకూ దేశంలో నమోదైన ప్రతి 100 కేసులకు టీబీ వైద్య సేవల ప్రాప్యత తగ్గటం వల్ల ఏప్రిల్ నాటికి 40 కేసులు మాత్రమే నమోదయ్యాయని రిపోర్టు పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక 44 శాతం టీబీ రోగులను కలిగిన భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో టీబీ నోటిఫికేషన్లలో 25-30 శాతం తగ్గుదల నమోదైంది. టీబీ వైద్య సేవలకు ఇలాగే అంతరాయం ఏర్పడితే.. టీబీ రోగుల మరణాల సంఖ్య 2 లక్షల నుంచి నాలుగు లక్షల వరకూ నమోదుకావచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, 2020-25 మధ్య కాలంలో టీబీ బారినపడే వారి సంఖ్య ఏడాదికి 10 లక్షలపైగా పెరిగే అవకాశముందని తెలిపింది. కరోనా కారణం గా టీబీ వైద్య సేవలకు ఏర్పడిన అంతరాయం కారణంగా.. టీబీ రోగుల మరణా లతో పాటు దీనిని అరికట్టడంలో ఇప్పటివరకూ ఉన్న పురోగతి తిరోగమనం దిశగా వెళ్లే అవకాశముందని హెచ్చరించింది. ఇదివరకూ నిర్ణయించుకున్న టీబీ లక్ష్యాలను సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా మరింత మెరుగైన ప్రణాళికలు, చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, టీబీ కార్యక్రమంలో భాగంగా అధికారికంగా రోగులను గుర్తించి నమోదుచేస్తారు. అయితే, 2019లో ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల కేసులు నివేదించబడలేదు. ఇదే ఏడాది భారత్లో మొత్తం 26.4 టీబీ కేసులలో 24 లక్షల కేసుల కేంద్ర ప్రభుత్వ జాతీయ టీబీ కార్యక్రమానికి నివేదించబడ్డాయి. అంటే 2.4 లక్షల కేసులు లెక్కలోకి రాలేదు. అయితే, టీబీ కేసుల్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతున్నది. 2015లో 17.4 లక్షల నుంచి 2019 నాటికి 24 లక్షలకు పెరిగింది.