Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : రాజకీయ ప్రత్యర్ధులను ఇరికించేందుకు ..ఓ దేవాలయం పూజారి తనపై తాను చేయించుకున్న హత్యాప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ దాడికి సదరు పూజారి ఓ పెద్ద పన్నాగమే పన్నాడు. తనపై కాల్పులు జరిపించుకునేందుకు ప్రొఫెషనల్ షూటర్ను నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు. పూజారిపై దాడి ఘటనలో ఆలయ ప్రధాన పూజారి సీతారామ్దాస్, తిర్రే గ్రామ పెద్దతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజారి అతుల్ త్రిపాఠి అలియాస్ సామ్రాట్ దాస్ కోలుకున్న తర్వాత అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఈ దాడికి అతుల్తో పాటు గ్రామ పెద కలిసి ప్రణాళికను రూపొందించారని చెప్పారు. ఈ నెల 10న గ్రామంలో ఉన్న దేవాలయంలో అర్థరాత్రి కాల్పులు జరగా.. సామాట్ర్ దాస్ గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారులు సైతం మీడియాకు తెలిపారు. ఈ దాడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాధికారులకు విమర్శలు ఎదురయ్యాయి. అయోధ్యలోని పలువురు పూజారులు సైతం పర్యటించి ..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి.. మాజీ గ్రామ పెద్ద అమర్ సింగ్, ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు. వారిలో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ కేసును ఐదు పోలీసు బృందాలు విచారణ చేపడుతుండగా.. దేవాలయ భూములకు సంబంధించి ప్రధాన పూజారి, మాజీ గ్రామ పెద్దకు మధ్య విభేదాలు ఉండటంతో..పాటు ప్రస్తుత గ్రామ పెద్దతో రాజకీయ వైరం ఉందని బయటపడింది. దీంతో మాజీ గ్రామ పెద్దను ఇరికించేందుకు ఈ ప్రణాళిక రూపొందించారని పోలీసులు తెలిపారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి...ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.