Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ మార్కెట్లను ఎప్పుడో రద్దు చేసిన నితీష్ ప్రభుత్వం
రైతు పంట దళారి పాలు
- ఎంత చెబితే అంతకు అమ్ముకోవాల్సిందే
- ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పంట కొనుగోలు కేంద్రాలు
న్యూఢిల్లీ : వ్యవసాయ మార్కెట్ యార్డ్ (ఏపీఎంసీ)ల వ్యవస్థను రద్దు చేసే యోచనతో మోడీ సర్కార్ నూతన వ్యవసాయ చట్టాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలకు నితీష్కుమార్ ప్రభుత్వం మద్దతు పలకటం ఆ రాష్ట్ర రైతాంగానికి రుచించలేదు. అంతేగాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి, వ్యవసాయరంగం ఏమాత్రమూ బాగోలేదు. నేడు మోడీ సర్కార్ చేసిన చట్టాల మాదిరే, 14ఏండ్ల క్రితం (2006లో) సీఎం కుర్చీలోకి రాగానే నితీష్కుమార్ ప్రభుత్వం కూడా వ్యవసాయ మార్కెట్లను దెబ్బతీసే నిర్ణయం తీసుకుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. బీహార్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని ఆయన రద్దు చేయటం బీహార్ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపర్చింది. రైతులకు తీరని అన్యాయం చేసిందని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు దూరం చేసిందని తెలుస్తోంది. బీహార్ అనుభవాల్ని చూస్తే ఎవరికైనా ఇది అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ సేకరణ నామమాత్రం
గతకొన్నేండ్లుగా బీహార్లో వ్యవసాయం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కనీస మద్దతు ధర వద్ద పంట ఉత్పత్తులు కొనుగోలు చేయటం అనే వ్యవస్థ అంతా దెబ్బతిన్నది. ఎంఎస్పీ కన్నా చాలా తక్కువకు రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్ముకునే పరిస్థితి సర్వసాధారణం. నితీష్ హయాంలో ప్రభుత్వ సేకరణ నామమాత్రంగా మారింది. దాంతో రాష్ట్రానికి అవసరమయ్యే 80శాతం ఆహార ధాన్యాలు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
అంతా దళారుల చేతుల్లో..
నేడు బీహార్లో ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు అమ్మకం జరిపే..హోల్సేల్ మార్కెట్లు అన్నీ కూడా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఇక్కడుండే ట్రేడర్లు, దళారులు చెప్పిన రేటుకు రైతు తన పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలేవీ ఇక్కడ పనిచేయవు. ఇక్కడ దళారులతో బేరసారాలు ఆడే శక్తియుక్తులు బీహార్లోని 91శాతం రైతులకు లేదు. బీహార్ ప్రధానంగా వెనుకబడటానికి ప్రధాన కారణం ఇదే. రాష్ట్ర జనాభాలో అత్యధికమందికి జీవనాధారం వ్యవసాయం. అయితే ఈ రంగమంతా ప్రయివేటు వ్యక్తులు, శక్తుల చేతుల్లో చిక్కుకొని ఉంది. రైతు గోడు వినేవాడే లేడు. నితీష్ ప్రభుత్వం ఆ వైపునకు వెళ్లే ఉద్దేశం ఎప్పుడూ చూపలేదు.