Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు.. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇటీవల రాసిన ఓ లేఖ రాజకీయ దుమారం రేపుతున్నది. కొష్యారీ రాసిన ఆ లేఖపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖపై స్పందించిన షా.. తాను ఆ లేఖను చదివానని వెల్లడించారు. ఈ లేఖ హుందాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 'సెక్యూలర్' వంటి పదాలను ఆయన ఉపయోగించకుండా ఉండాల్సిందని అన్నారు. ఈ లేఖలో ఉపయోగించిన అనేక పదాలు తగినవిగా లేవని అన్నారు. ఓ జాతీయ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ప్రార్థన మందిరాలు తెరిచే అంశాన్ని గురించి గవర్నర్ కొష్యారీ.. సీఎం ఉద్ధవ్కు లేఖ రాశారు. రాష్ట్రంలో మళ్ళీ గుడులను, ప్రార్థనా మందిరాలను ఎప్పడు తెరుస్తారంటూ లేఖ రాశారు. అందులో మీరు సెక్యులర్ కాదా?అనీ, హిందుత్వ నినాదాన్ని వదిలేశారా? అంటూ పలు ప్రశ్నలు వేశారు. ఈ లేఖపై తీవ్రస్థాయిలో స్పందించిన ఉద్ధవ్ సర్కారు.. గవర్నర్ను రికాల్ చేయాలంటూ డిమాండ్ చేసింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ అయితే ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో కేంద్ర హోం మంత్రి షా సైతం గవర్నర్ లేఖను తప్పుపట్టాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.