Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
- రెండో తీవ్రతను తోసిపుచ్చలేం : నిటి ఆయోగ్ సభ్యులు వికె పాల్
- కాలుష్యంతో మరింత ఉధృతం : ఎయిమ్స్ నిపుణుల బృందం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి మొదలైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అయితే, కొన్ని జిల్లాల్లోనే కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇది వరకే ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంధ్ర జైన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైందని ఆయన అనేకసార్లు వెల్లడించారు. బెంగాల్, కేరళ ప్రభుత్వాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించినా అప్పుడు కేంద్రం దీన్ని ధ్రువీకరించలేదు. ప్రస్తుతం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,003 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మొత్తం 1,14,031కి పెరిగింది. ఇదే సమయంలో కొత్తగా 61,871 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా సోకిన వారి సంఖ్య 74,94,552కు పెరిగింది. ప్రస్తుతం 7,83,311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రెండో తీవ్రతను తోసిపుచ్చలేం
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్తో పాటు శీతాకాలంలో కరోనా వైరస్ రెండో తీవ్రతను తోసిపుచ్చలేమంటూ నిటి అయోగ్ సభ్యులు, కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ చీఫ్ డాక్టర్ వికె.పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత మూడు వారాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా తగ్గదల స్థిరంగా కొన సాగుతున్నదని అన్నారు. మరణాలు, పాజటివ్ కేసులు తగ్గుతున్నాయని తెలి పారు. అయితే, రానున్న పండగ రోజులు, శీతాకాల సీజన్లో రెండో సారి వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. పలు రాష్ట్రా ల్లో కరోనా తగ్గుదల కనిపించినప్పటికీ.. ఐదు రాష్ట్రాలు (కేరళ, కర్నాటక, రాజ స్థాన్, ఛత్తీస్గఢ్, బెంగాల్), నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతున్నదని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ కొంత మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నదనీ, ఎందుకంటే ఇప్పటికీ 90శాతం ప్రజలు కరోనా సంక్రమణకు గురయ్యేస్థితిలో ఉన్నారని తెలి పారు. రాబోయే నెలలు సవాలుతో కూడుకున్నవనీ, మరింత జాగ్రత్తగా ఉండాల ని సూచించారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టే చర్యలను మరింత కఠినంగా పాటించాలని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దానిని ప్రజలకు అందించడానికి కూడిన మెరుగైన సౌకర్యాలు దేశంలో ఉన్నాయని తెలిపారు.
గాలితోనూ వ్యాప్తి
గాలి కాలుష్యంగా కారణంగా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమయ్యే అవకాశ ముందనీ, వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని వారికి కోవిడ్-19 సోకే ప్రమాదం రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల బృందం వెల్లడించింది. శీతాకాలం సమీపిస్తుండటంతో పాటు వాయు కాలష్యం పెరుగుదల అనేది కోవిడ్-19 వ్యాప్తికి అనుకూలంగా ఉం టుందని ఈ బృందం హెచ్చరించింది. వాయు కాలుష్యం పెరగడం వల్ల ఇన్ఫ్లూయెంజా వంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు సంభ విస్తాయనీ, దీని లక్షణాలు.. కరోనా లక్షణాలు సైతం ఒకేలా ఉండటం కరోనా రోగుల గుర్తింపు క్లిష్టంగా మారుతుందని తెలిపింది.