Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో 76శాతం మందికే పోషకాహారం : తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : 'ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ న్యూట్రీషియన్' విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పౌష్టికాహారం పొందే పరిస్థితి గ్రామీణ భారతంలో 76శాతం మందికి లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. పాలు, గుడ్లు, ఆకు కూరలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకునే ఆర్థిక స్థోమత ప్రతి నలుగురిలో ముగ్గురికి లేదని అధ్యయనం పేర్కొంది. 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్' ఎకానమిస్ట్ కల్యాణీ రఘునాథన్ నేతృత్వంలో కొంత మంది నిపుణులు ఈ అధ్యయనాన్ని జరిపారు. వీరి పరిశోధన పత్రాన్ని 'అఫొర్డబిలిటీ ఆఫ్ న్యూట్రీషియస్ డైట్స్ ఇన్ రూరల్ ఇండియా' పేరుతో 'ఫుడ్ పాలసీ' జర్నల్ ప్రచురించింది. దీంట్లో పేర్కొన్న అంశాలు ఈవిధంగా ఉన్నాయి. ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ న్యూట్రీషియన్ మార్గదర్శకాల ప్రకారం, ఒక మహిళ ఒక రోజు తీసుకునే ఆహారంలో 330 గ్రాములు గోధమలు లేదా బార్లీ లేదా మొక్కజొన్న ఉండాలి. 75గ్రాములు పప్పులు, 300 గ్రాములు పాలు సంబంధిత పదార్థాలు, 100గ్రాములు పండ్లు, 300 గ్రాములు కూర గాయలు ఉండాలి. ఇందుకోసం గాను ప్రతి మహిళా గోధుమలు, బియ్యం, పాలు, పెరు గు, ఉల్లిగడ్డలు, ముల్లంగి, బచ్చలికూర, అరటిపండ్లు.. తీసుకోవాలంటే 51 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ స్థాయిలో ఆహారంపై ఖర్చు చేసే స్థోమత గ్రామీణ ప్రజల్లో లేదని అధ్యయనంలో తేలింది. ఒకవేళ ఆయా కుటుంబాలు తమ ఆదాయాన్నంతా పౌష్టికాహారంపై ఖర్చు చేయదలుచుకున్నా, 52 కోట్లమంది పౌష్టికాహారాన్ని పొందలేరు. దీనర్థం..వారి ఆదాయాలు, ఆర్థిక స్థోమత పౌష్టికాహారాన్ని పొందే స్థితిలో లేదని పరిశోధకులు పేర్కొన్నారు.