Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ నాటికి 75 శాతం పూర్తి
- ఆర్థిక మంత్రి సూచన
- ప్రథమార్థంలో 32శాతం వ్యయం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని 14 కంపెనీలు వచ్చే మూడు నెలల్లో తమ మొత్తం మూలధన వ్యయ ప్రణాళికల్లో 75 శాతం ఖర్చు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కరోనా సంక్షోభం వల్ల అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తిరిగి పుంజుకోవడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా బొగ్గు, చమురు, సహజ వాయువు తదితర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో మంత్రి సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని 14 పీఎస్యూలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల మూలధనం వ్యయం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాగా ఇందులో డిసెంబర్ నాటికి కనీసం 75 శాతం వ్యయం చేసేలా సంబంధిత మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సీతారామన్ ఉన్నతాధికారులకు సూచించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం (సెప్టెంబర్ ముగింపు నాటికి) ఈ పీఎస్యూలు 37,423 కోట్లు వ్యయం చేశాయి. ఇది మొత్తం లక్ష్యంలో 32 శాతం మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. ఏకంగా రూ.1.16 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. లక్ష్యం కన్నా 104 శాతం వ్యయం చేశాయి. మూలధన లక్ష్యాలను నెరవేర్చడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు మరింత సమన్వయంతో పని చేయాలని మంత్రి సీతారామన్ సూచించారు. దీని ద్వారా భారత వృద్ధి రేటుకు మద్దతునిచ్చేలా కృషి చేయాలని ఉన్నతాధికారులతో తెలిపారు. గడువు సమయంలో లక్ష్యాన్ని చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మంచి పనితీరును కనబర్చడం ద్వారా కరోనా సంక్షోభం నుంచి బయట పడటానికి పెద్ద మార్గమన్నారు.