Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రవాణా పరిశ్రమను, కార్మికుల జీవనోపాధిని రక్షణకు నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు అఖిల భారత రవాణా కార్మికుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈ నెల 18న నేపల్దేవ్ భట్టాచార్య, జనార్థన్ పతీ అధ్యక్షతన ఆన్లైన్లో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో రవాణా పరిశ్రమ, కార్మికుల పరిస్థితిని సమీక్షించారు. కరోనా సమయంలోనూ డీజిల్, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరకు రూ. 16, రూ 13 పెంచడం రవాణా రంగం ప్రస్తుత సంక్షోభానికి కారణంగా తెలిపింది. దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత కార్మికులు తమ మనుగడ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జమ్ముకాశ్మీర్లో ప్రభుత్వ రవాణా కార్మికులకు కూడా గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లోనూ సకాలం వేతనాలు ఇవ్వడం లేదని తెలిపింది. కేంద్రం ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చూస్తున్నదనీ, కార్పొరేట్ల సేవలోనే బీజేపీ ప్రభుత్వం తరిస్తుందని విమర్శించింది. ఇలాంటి నేపథ్యంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతీ వ్యక్తికి 10 కేజీల ఆహారధాన్యాలు 2021 మార్చి వరకూ అందించాలని, అసంఘటిత కార్మికులకు నెలకు రూ.7,500 ఆర్థిక సహాయం చేయాలని... వంటి డిమాండ్లతో నవంబర్ 26న సమ్మెకు వెళ్లాలని సంఘం నిర్ణయం తీసుకుంది. సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు, రవాణా రంగ భాగస్వామ్యులకు విజ్ఞప్తి చేసింది.