Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత, చైనా సరిహద్దులో 1959లో జరిగిన సంఘటనలో దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరమూ అక్టోబర్ 21వ తేదీని పోలీస్ సంస్మరణ దినంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఈ సంస్మరణ దినాన్ని 'పోలీస్ ఫ్లాగ్ డే' గా అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరమూ ఈ పోలీసు అమర వీరుల సంస్మరణ దినం - పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అమరుల నుంచి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్సాహాన్ని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 264 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాపాయం జరగలేదు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో కేవలం ఒక పోలీసు అధికారి తీవ్రవాదుల చేతిలో మరణించారు.
మహిళా భద్రతకు పెద్దపీట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రావిర్భావం అనంతరం పోలీస్ శాఖ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్దఎత్తున సి.సి. కెమెరాల ఏర్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్లో వినియోగించుకోవడం, ఫ్రెండ్లీ పోలీసింగ్, డయల్ 100, మహిళా భద్రతకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేశారు. దాదాపు 80 వేల మందికి పైగా పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ నిర్మాణం ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న పోలీస్శాఖ మెరుగైన సేవలను పౌరులకు అందిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్న వామపక్ష తీవ్రవాదులతోనూ అంతే స్థాయిలో సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడుతూ అసువులు బాసిన ఈ 326 మంది అమర పోలీసులకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
మొట్టమొదటి పోలీస్ అమర వీరుడు..
తెలంగాణలో మొట్ట మొదటి పోలీస్ అమర వీరుడు మహమ్మద్ ఇబ్రాహీం. ఇప్పటి వరకు నిస్వార్థ సేవలందిస్తూ, విధి నిర్వహణలో మొత్తం 326 మంది అసువులు బాసారు. ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ఉన్నారు. వీరిలో 180 మంది కానిస్టేబుళ్లు, 52 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు ఏఎస్ఐలు, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, పది మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు గ్రేహౌండ్స్కు చెందిన 32 మంది వివిధ హోదాల అధికారులున్నారు. ఉన్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణకై నిస్వార్థ సేవలందించిన ఈ పోలీసు అమరవీరులకు మొత్తం దేశ ప్రజలు అక్టోబర్ 21 న నివాళులు అర్పిస్తున్నారు.
- కన్నెకంటి వెంకట రమణ
(అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం)