Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనాతో పోరాడేందుకు భారత్లో జరుగుతున్న వ్యాక్సిన్ తయారీ, పరిశోధన చాలా కీలకమనీ, ముఖ్యంగా భారీ ఎత్తున టీకాలు రూపొందించడం అవసరమని మైక్రోసాఫ్ట్ అధినేత, బిలియనీర్ బిల్గేట్స్ అన్నారు. 'గ్రాండ్ ఛాలెంజ్'స్ వార్షిక సమావేశం 2020లో కరోనా వ్యాక్సిన్ రూపొందించటంలో, పరిశోధనల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. పరిశోధనలు పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ప్రతిరోజూ శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలను అందిస్తున్నారని చెప్పారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వైరస్కు సంబంధించిన 1,37,000 జన్యు క్రమాలను అందించారనీ, ఔషధ కంపెనీలు కూడా టీకా ఉత్పత్తి మార్గాలకు సహకరిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి సవాళ్ల గురించి మాట్లాడుతూ.. ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ గతంలో అనేక కీలక వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిందనీ, కరోనాకు కూడా ఎంఆర్ఎన్ఎ రూపొందించిన వ్యాక్సినే మొదటగా ఆమోదం పొందే అవకాశం ఉందని అన్నారు. రాబోయే ఏండ్లలో ఎంఆర్ఎన్ఎ మరింత అభివృద్ధి చెందుతుందని బిల్గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించడం, రోగ నిర్థారణ పరీక్షలు, అనంతరం వైద్యం అందించడం సులభతరం చేయాలని సూచించారు. ఆర్టీ- పీసీఆర్ పరీక్షలు సులభతరంగా ఉన్నప్పటకీ.. పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు సవాలుతో కూడుకున్నాయని అన్నారు. పరీక్షలను వేగవంతం చేయాలనీ, ఔషధాలను కమ్యూనిటీ సెంటర్లలో, ఫార్మసీలలో నిల్వ చేయాలని అన్నారు. టీకాల క్లినికల్ ట్రయల్స్కు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందాలు సోదరభావంతో సహకరిస్తున్నాయనీ, ఈ టీకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ... వచ్చే ఏడాది ప్రారంభంలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.