Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గావ్ కనెక్షన్ అధ్యయనంలో వెల్లడి
- పంట ధరలు, ఎంఎస్పి రద్దుపై రైతుల్లో ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నూతన చట్టాలను దాదాపు దేశంలోని దాదాపు 52 శాతం రైతులు వ్యతిరేకిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. గావ్ కనెక్షన్ అనే సంస్థ ది ఇండియన్ ఫార్మర్స పర్సెప్షన్ ఆఫ్ ది న్యూ అగ్రి లాస్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందుకోసం ఈ సంస్థ ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకూ 16 రాష్ట్రాల్లోని 53 జిల్లాల్లో రైతాంగాన్ని ప్రశ్నించింది. గావ్ కనెక్షన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అధ్యయనం కోసం 5,022 మంది రైతులతో ముఖాముఖి మాట్లాడినట్లు తెలిపింది. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలను సమర్ధించే రైతుల సంఖ్య కూడా 35 శాతం ఉందని పేర్కొంది. అయితే ఈ విధంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే, సమర్ధించే వారిలో సగం మందికి వాటి గురించి సరైన సమాచారం లేదని తెలిపింది.
ఓపెన్ మార్కెట్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని, రైతులకు స్వేచ్ఛ కల్పించేందుకు, వారు దళారుల భారిన పడకుండా తాము ఈ చట్టాలను తీసుకువచ్చినట్లు మోడీ సర్కార్ చెప్పుకొస్తోంది. అయితే ఒక సన్న, చిన్నకారు రైతు తన పంటను ఎంత దూరం తీసుకెళ్లగలడని, అందుకయ్యే పెట్టుబడిని ఆయన భరించగలడా అన్న అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే సమయంలో కనీస మద్దతు ధర(ఎంఎస్పి) నుంచి ప్రభుత్వం మెళ్లగా తప్పుకునేందుకు ఈ విధమైన చట్ట సవరణలను తీసుకువస్తోందని విమర్శిస్తున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాల ద్వారా ఓపెన్ మార్కెట్లో తమ పంట ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకునే బలవంతపు పరిస్థితులు ఏర్పడుతాయని 57 శాతం రైతులు భయాందోళన వ్యక్తం చేసినట్లు గావ్ కనెక్షన్ అధ్యయనం పేర్కొంది. అదేవిధంగా తాజా చట్ట సవరణలతో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు ముగింపు పలుకుతుందేమోనని 33 శాతం రైతులు అభిప్రాయపడినట్లు తెలిపింది. ఎంఎస్పి వ్యవస్థను తప్పనిసరి చేస్తూ దేశంలో చట్టం తీసుకురావాలని 59 శాతం రైతులు కోరారని వెల్లడించింది.