Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 1600 మంది సైనికులు మృతి
- సెప్టెంబర్ నెలలోనే ఆరుగురు కల్నల్ ర్యాంక్ అధికారులు కన్నుమూత
న్యూఢిల్లీ : దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించే సైనికులు యుద్ధం చేయకుండానే ఏటా 1,600 మంది చనిపోతున్నారంటే నమ్ముతారా..! కానీ ఇది నిజం..సెప్టెంబరు నెలలోనే ఆరుగురు కల్నల్ స్థాయి అధికారులూ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 40 నుంచి 45 ఏండ్లలోపువారే. మరి వీరంతా ఎందుకు చనిపోతున్నారు..? జీతాలు.. క్యాంటిన్ సౌకర్యాలు.. క్యార్టర్లు ఇలా సౌకర్యాలు ఉండి కూడా వారి బతుకులు ఎందుకు అర్థంతరంగా ముగుస్తున్నాయి..? దీనిపైనే సర్వత్రా చర్చ..
వాస్తవానికి దేశం కోసం పోరాడే మిలటరీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆశాజనకంగా లేదని సీనియర్ ఎనలిస్ట్, రిటైర్డ్ కల్నల్ గురురాజ్ గోపీనాథ్ పామిడి తాజా అధ్యయనంలో తేలింది. సైనికబలగాల బతుకు నిరంతరం టెన్షన్తో కూడుకున్నది. ఇప్పుడున్న ఉద్రిక్త వాతావరణం గతంలో ఎన్నడూలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక.. అటు పాక్.. ఇటు చైనాతో కవ్వింపుచర్యలు సైనికుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. 30 నుంచి 40 ఏండ్ల వయస్సు ఉన్న ఆర్మీ అధికారుల స్పందనలను పరిగణనలోకి తీసుకుని రిటైర్డ్ కల్నల్ గురురాజ్ ఈ అధ్యయనం చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
సాంకేతిక ప్రభావం
సాంకేతిపరమైన అభివృద్ధి కూడా మానసికంగా, శారీరకంగా కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నది. నిరంతరం పనిలో నిమగమవ్వటం వల్ల కూడా ఆ ఒత్తిడి ఉంటుందని (కాన్సన్ట్రేషన్ చెకర్స్) తేలింది. ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడటానికి ఫోన్లు, ట్యాబెలెట్లు వినియోగిస్తున్నట్టు (60శాతం మంది)అధ్యయనంలో తేలింది.
జీరో ఎర్రర్ సిండ్రోమ్స్
79శాతం మంది తమ వల్ల ఎలాంటి తప్పు జరగకుండా చూడాలనుకుంటారు. కానీ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది వారి బాధ్యత. ఇలాంటి సందిగ్ధాలెన్నో వారిలో జీరో ఎర్రర్ సిండ్రోమ్స్ను పెంచుతున్నాయి.
సమతుల్యతను పాటించకపోవటం వల్ల అది సైనికబలగాల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడానికి కారణమవుతున్నది. తొలినాళ్ల నుంచే సైనికులపై సాంకేతికపరమైన ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. సైన్యంలో చేరే యువత ఎక్కువ కాలం పనిచేయటం కూడా ఓ కారణమని తేలింది. మిగతా ఉద్యోగుల్లా విధులు ముగించుకుని ఇండ్లకు వెళ్లే వారిలా కాకుండా తాము ఎక్కువ కాలం పనిచేస్తున్నామనే భావన వారిలో వ్యక్తమైంది.
స్వేచ్ఛ కావాలి..
ప్రతి ఉద్యోగికి స్వేచ్ఛ ఉన్నప్పుడే ఎక్కువగా ఆలోచించటానికి వీలుకలుగుతుంది. కానీ జవాన్లకు అలాంటి వెసులుబాటు లేదు. యాంత్రికంగా పనిచేయటమే తప్ప... దేశం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశమేలేదు. దీంతో తాము బలహీనులమనీ, క్రియేటివ్గా చేసి చూపాలనే తపన ఉన్నా నీరుగారిపోతున్నారని అధ్యయనంలో తేలింది. కేవలం తాము పై అధికారులు, ప్రభుత్వం చెప్పింది చేసుకుపోవటం మినహా నిస్సహాయులుగా ఉండిపోతున్నామనే భావన మిలటరీలో వ్యక్తమవుతున్నది. ఇలాంటి ఎన్నో కారణాలు తక్కువ వయస్సులోనే గుండెజబ్బులతో మరణాలకు దారితీస్తున్నదని వెల్లడైంది. వీటికి తోడు జీరో సిండ్రోమ్స్ను రూపుమాపితే కానీ సైనికబలగాల బతుకులు అర్థంతరంగా ముగియకుండా..హాయిగా దేశభద్రతకు కార్యోన్ముఖులవుతారని పలువురు మాజీ సైనికోద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ఒత్తిడి ఇలా...
- 87శాతం మందిలో తీవ్ర పని ఒత్తిడి
- 73శాతం మందిని సెలవులు తీసుకున్నా.. వెనక్కి రమ్మని ఉన్నతాధికారుల పిలుపు
- 63శాతం మంది వైవాహిక జీవితంపై ప్రభావం
- 85శాతం భోజనం చేసేటప్పుడు కూడా ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఫోన్లకు సమాధానం