Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలపై పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
- రైతుల కోసం మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
చండీగఢ్: రైతుల ప్రయోజనాలకు నష్టం కల్గించేలా రూపొందించిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పంజాబ్ శాసనసభ తీర్మానం చేసింది. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అదే విధంగా కేంద్ర చట్టాల స్థానంలో పంజాబ్ రైతులకు లబ్దిచేకూర్చేలా ఆయన ప్రవేశ పెట్టిన మూడు బిల్లులనూ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవ సాయ చట్టాలపైన చర్చించడానికి ప్రత్యేకంగా నిర్వహిం చిన ఈ సమావేశాలకు శాసనసభలో ఉన్న ఇద్దరు బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్మ మంత్రి అమరీందర్సింగ్ మాట్లాడుతూ కేంద్ర బిల్లులను వ్యతిరేకించినందున తమ ప్రభుత్వాన్ని తొల గిస్తారని కొందరు అంటున్నారని, అటువంటి వాటికి తాను భయపడేది లేదని ఆయన చెప్పారు. రైతులను బాధపెట్టేందుకు, వారి ప్రయోజనాలకు భంగం కలిగేందుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతిం చేది లేదని అన్నారు. అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికియైనా వెనుకాడనని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 'మేము మీకు మద్దతుగా నిలబడ్డాం, ఇప్పుడు మాకు మద్దతుగా నిలబడటం మీవంతు' అని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కొత్త బిల్లులు ...
కేంద్ర చట్టాల స్థానంలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం ప్రత్యేక నిబంధనలు మరియు పంజాబ్ సవరణ బిల్లు 2020, ధరల హామీకి సంబంధించి రైతుల ఒప్పందం మరియు వ్యవసాయ సేవల బిల్లు 2020, అత్యవసర వస్తువుల(ప్రత్యేక నిబంధనలు మరియు పంజాబ్ సవరణ) బిల్లు 2020 పేర్లతో బిల్లులను పంజాబ్ ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. వీటి వల్ల కేంద్ర చట్టాల నుంచి రక్షణ లభించడంతోపాటు, పంజాబ్ రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఆహార ధాన్యాల సేకరణ, కనీస మద్దతు ధర పొందడం రైతుల ప్రాధమిక హక్కు అంటూ, ఎఫ్సీఐతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా ధాన్యాన్ని సేకరించేలా కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం చేయబోయే సుదీర్ఘ న్యాయ పోరాటానికి తాము తీసుకున్న చర్యలు ప్రాతిపదికగా ఉంటాయని అన్నారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సభలో మారుమ్రోగాయి. అంతకుముందు కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ఆప్ ఎంఎల్ఏలు సభలో ఆందోళన చేశారు. సోమవారం రాత్రంతా వారు సభలోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ముసాయిదాను సభలో ప్రవేశపెట్టడానికి ముందే తమకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.