Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుపి బిజెపి చీఫ్వ్యాఖ్యలు
బల్లియా : పాకిస్తాన్, చైనాలతో సరిహద్దుల విషయంలో ఉద్రిక్తతల కొనసాగుతుండగా..బిజెపి నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలతో యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధాని మోడీ స్పష్టతతో ఉన్నారని, అందుకు తేదీలను కూడా ఖరారు చేశారని బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బిజెపి ఎమ్మెల్యే సంజరు యాదవ్ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆ వీడియోను సోషల్ మీడి యాలో పోస్టు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. భారత్-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ వార్తల్లోకెక్కారు. అయోధ్య లోని రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 రద్దు వంటి తదితర అంశాలపై ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో..ఇప్పుడు కూడా అంతే వేగంగా నిర్ణయాలు ఉంటాయని స్వతంత్రదేవ్ చెప్పారు. ఈ అంశాలపై తీసుకున్న మాదిరిగానే పాక్, చైనాలతో ఎప్పుడు యుద్ధం జరపాలో మోడీ నిర్ణయించారని వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.