Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి గడ్కరీకి జాతీయ కమిషన్ సభ్యుడు ఆచారి విజ్ఞప్తి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రపదేశ్లో నడుమ ఉన్నటువంటి నంద్యాల నూతన జాతీయ రహదారి ఓపీఆర్ పనులు పూర్తి చేసి రహదారులను ప్రారంభించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఢిల్లీలో ఆచారి, నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్నేని సుధాకర్రావు, నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జి దిలీప్ ఆచారి సోమవారం కలిశారు. గత శానససభ ఎన్నికల సందర్భంగా కొల్లాపూర్ సభలో ఇచ్చిన హామీ మేరకు ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించినందుకు వారు కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. గడ్కరీ కొల్లాపూర్ సభలో మాట్లాడిన వీడియోను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన పరిస్థితిని వివరించినట్టు వెల్లడించారు. అనంతరం ఢిల్లీలో తల్లోజు ఆచారి విలేకరులతో మాట్లాడారు. 200 కిలోమీటర్ల ఈ మార్గం నిర్మాణానికి రూ .800 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపిందని సమాధానం ఇచ్చారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై సిద్దేశ్వరం వంతెన నిర్మిస్తారని తెలిపారు. ఈ మార్గం పూర్తయితే బెంగళూర్కు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన చెప్పారు. దేవరకొండ జడ్చర్ల - రాయచూర్ , హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు. ఈ రహదారి అలానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత జాతీయ రహదారి మంజూరుకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఆచారి మీడియాకు తెలిపారు.