Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాల్ని నిర్వీర్యం చేయాలన్న తొందరే తప్ప, పంజాబ్ చేసిన కొత్త బిల్లులతో పెద్దగా ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు, వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్లోనే ఇలాంటి చట్టాలు రాకుండా అడ్డుకోవాలి తప్ప, రాష్ట్రాలు వాటిని అడ్డుకోవటం సాధ్యమయ్యే విషయం కాదని వారంటున్నారు. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే, పంజాబ్, రాజస్తాన్ ఇలా ఏ రాష్ట్రమైనా ప్రత్యేకంగా చట్టాలు చేస్తే...దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. అప్పుడే ఆ బిల్లులకు చట్టబద్ధత వస్తుంది. ఆ అవకాశం లేదన్నది మనందరికీ తెలిసిందే. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీల్లో ప్రత్యేకంగా బిల్లులు తీసుకురావటమన్నది...ఒక రాజకీయ ఆందోళన మాత్రమేనని వారు తేల్చి చెబుతున్నారు. ఇక పంజాబ్ చేసిన మూడు వ్యవసాయ బిల్లుల విషయానికొస్తే, దాంట్లోని కనీస మద్దతు ధర నిర్ణయం, పంట ఉత్పత్తుల నిల్వలు...వంటివాటిపై నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కరువు, అధిక ధరలు, ప్రకృతి విలయాలు, ఇతర పరిస్థితులు తలెత్తినప్పుడు పంట ఉత్పత్తుల నిల్వపై ప్రభుత్వం నిబంధనలు విధిస్తాయని 'ఎసెన్షియల్ కామోడెటీస్' (పంజాబ్ బిల్లు) లో పేర్కొన్నారు. ఇది రైతులకు నష్టాన్ని చేకూరుస్తుందని, ఎంఎస్పీ ధర రానప్పుడు రైతులు తమ పంటల్ని నిల్వ చేసుకుంటారు. దీనిని నిరాకరించేవిధంగా బిల్లులోని అంశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.