Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వర్చువల్ ప్రచారాల'పై స్టే
- తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ఈసీకి ఆదేశాలు
భోపాల్ : మధ్యప్రదేశ్లో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వర్చువల్ ర్యాలీలు, ప్రచారాలకు ఆదేశాలు జారీ చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. చట్టం ప్రకారం.. కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ర్యాలీలకు సంబంధించిన విషయంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ (ఈసీ)ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫిజికల్ ర్యాలీలకు బదులుగా వర్చువల్ ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించుకోవాలని రాజకీయపార్టీలను రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే, న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ ఈసీతో పాటు మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్లు ఈనెల 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను నిలిపేసింది. హైకోర్టు ఆదేశాల కారణంగా కోల్పోయిన ఎన్నికల ప్రచార సమయానికి సంబంధించి ఈసీకి నివేదించాలని తోమర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి సూచించింది. ఉప ఎన్నికల్లో గ్వాలియర్ నియోజకవర్గం నుంచి తోమర్ పోటీ చేస్తున్నారు.