Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కరోనా సమయంలో కూడా విస్తృతంగా సేవలందించినా ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేతనం ఇవ్వకపోవడంతో వైద్యులు ఆందోళన తెలిపారు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు వేతనాలు ఇవ్వనందుకు నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. వేతనాలతో పాటు నాలుగు డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యుల నాయకులు ఆర్ఆర్ గౌతమ్ మీడియాకి తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సైతం తాము రోగులకు సేవలు అందించామని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలక విభాగం మూడు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వకపోవడం దారుణం అన్నారు. తాము ఈ నెల 19వ తేదీ నుంచే నిరవధిక దీక్షకు వెళ్ళాలని నిర్ణయించామని అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొద్దిరోజులు వాయిదా వేసుకున్నామని చెప్పారు. అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని హిందూరావ్ కాలేజీ వైద్యులు ఇప్పటికే మాస్ లీవ్ కార్యక్రమంలో భారంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు.