Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటిని నిర్వీర్యం చేసేలా కొత్త బిల్లులు :రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని నిర్వీర్యం చేసేవిధంగా కొత్త బిల్లులు తీసుకొస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. దీనిపై ఈనెల 31న అసెంబ్లీ సమావేశమై కొత్త బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సోమవారం మీడియాకు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఇప్పటికే కొత్త బిల్లులకు ఆమోదముద్ర వేసింది. మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇదే విధమైన బిల్లుల్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్ కూడా పంజాబ్లాగా వ్యవసాయ చట్టాలను నిర్వీర్యం చేసే నిర్ణయం తీసుకుంటుందని సీఎం అశోక్గెహ్లాట్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే ట్రేడర్స్ను జైలుకు పంపుతామని, మూడేండ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే విధంగా బిల్లు తీసుకొస్తామని అశోక్ గెహ్లాట్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ మాట్లాడుతూ..'' రైతాంగం హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈనేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా'' అని ట్విట్టర్లో సందేశం పోస్ట్ చేశారు.