Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తీరుపై పలువురు మండిపాటు
కోల్కతా : పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. దుర్గాష్టమిని పురస్కరించుకునుని కోల్కతాలో నివాసముంటున్న బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నేత బుద్దదేవ్ భట్టాచార్యను జగదీప్ దంపతులు కలిశారు. దానికి సంబంధించిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఆయనకు మంచి ఆరోగ్యం సిద్ధించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఆ ఫోటోలపై సీపీఐ(ఎం) నేతలు, పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆరా తీసినందుకు సంతోషమని, కానీ మీరు పంచుకున్న ఫోటోలు తమనెంతో మనోవేదనకు గురిచేశాయని సీపీఐ(ఎం) మండిపడింది. భట్టా చార్యకు అంతర్జాతీయంగా పేరు ప్రఖాత్యలున్నాయని, ఎన్నో దశాబ్దాలుగా, ఎంతో నిబద్ధ తతో రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆయనను ఫోటోలు తీయడం సరైన చర్య కాదని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా సీపీఐ(ఎం) మద్దతుదారులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ప్రజల మనోభావాలను దెబ్బతినేలా చేశారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చిత్రాలను తొలగిస్తే..చాలా సంతోషిస్తామని ట్వీట్ చేసింది. కాగా, నెటిజన్లు సైతం ఈ ఫోటోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత వాజ్పేయి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు... చూసేందుకు వెళ్లిన వారూ ఇలాగే ఆయన ఫోటోలు తీసి పోస్ట్ చేశారా అంటూ మండిపడుతున్నారు.