Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత వ్యాక్సిన్ బీహారీలకేనా?
- బీజేపీ ఎన్నికల వాగ్దానంపై విమర్శల వెల్లువ
- దసరా ముందు మోడీ చెప్పిన కరోనా జాగ్రత్తలు ఎటు పోయాయి : విశ్లేషకులు
- వాక్సిన్ ఇప్పట్లో రాదన్న సంగతి కేంద్రానికీ తెలుసు..!
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం మోడీ సర్కార్ రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తోంది. కొత్తగా 19లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ఎన్నికల వాగ్దానం చేసింది. ఇందులో 'ఉచిత కరోనా వ్యాక్సిన్' అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అజెండా కోసం వ్యాక్సిన్ను వాడుకుంటారా? అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలోనూ బీజేపీ వ్యాక్సిన్ హామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'మాకు ఓట్లేస్తే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వటం..,చాలా దారుణ''మని రాజకీయ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. 'బీహార్' ఎన్నికల ఫలితాలు కేంద్రంలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మిగిలిన రాష్ట్రాల సంగతేంటి?
మనదేశంలోని వైద్య, ఆరోగ్య వనరుల ప్రకారం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వొచ్చని, వ్యాక్సిన్ ధరలపై ఆయా సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ఆధారంగా చూసినా...ఇది అమలుజేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పాల్సింది పోయి, కరోనా సంక్షోభాన్ని, వ్యాక్సిన్లను బీహార్ ఎన్నికల విజయానికి వాడుకోవటాన్ని పాలకుల సంకుచిత మనస్తతత్వానికి
నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. దేశం మొత్తంగా అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని.. దీనికి కులం, మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదని ప్రధాని మోడీ గతంలోనే హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకొని బీహార్ ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా మరో రకంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఎలాగైనా ఓటర్లును ప్రలోభాలతో లోబర్చుకోవాలన్న తాపత్రయమే కనపడుతున్నదని తెలుస్తోంది.
కరోనా జాగ్రత్తలేమయ్యాయి?
వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్న మాటెలా ఉన్నా, మనదేశంలోని వివిధ సంస్థలు, వైద్య నిపుణుల మాట ప్రకారం..కరోనా వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పట్టేట్టు కనపడుతున్నది. దసరాకు కొద్ది రోజుల ముందు ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనా వ్యాప్తిని తక్కువ అంచనావేయరాదని చెప్పారు. ప్రజలు మరికొంత కాలం జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు, భౌతికదూరం పాటించాలని చెప్పారు. మరోవైపు అదే మోడీ సర్కార్ బీహార్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేస్తుండటం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విజయం కోసం కరోనా జాగ్రత్తలన్నీ పక్కకుపెట్టి, ప్రజల్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా లెక్కలు !
ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశకు వచ్చింది. దీని ధర సుమారుగా రూ.230 ఉండొచ్చని సమాచారం. అయితే అసలు విషయం ఏంటంటే, మొదటి డోస్ ఫలితాలు అక్టోబరు ఆఖరు కల్లా వస్తాయి. రెండో డోసు ఫలితాలు రావాలంటే నవంబరు దాటాల్సిందే. వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ కూడా పూర్తికావడానికి డిసెంబరు దాటుతుందని సంస్థ (సీరం ఇనిస్టిట్యూట్) అధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జనవరి 2021 నాటికి సీరం ఇనిస్టిట్యూట్ తన వ్యాక్సిన్ ట్రయిల్స్ ఫలితాల్ని 'డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా' (డీసీజీఐ)కి ఇవ్వబోతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, డీసీజీఐ అనుమతి ఇస్తే, వెంటనే కేంద్రం రంగంలోకి దిగితే వాక్సిన్ మందు ఉత్పత్తికి ఆర్డరు వెళ్తుంది. అటు తర్వాతగానీ వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక విడుదలవుతంది. భారత్ బయోటెక్ (హైదరాబాద్) , బయోలాజికల్-ఈ (హైదరాబాద్), జైడస్ క్యాడిలా (అహ్మదాబాద్) కంపెనీల వ్యాక్సిన్లు ట్రయిల్స్ పూర్తి కావడానికి చాలా సమయమే పడుతుంది.