Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11శాతం మంది 'సీరియస్ క్రిమినల్' అభ్యర్థులే
- 23శాతం మంది కోటీశ్వరులు: ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసులు కలిగి ఉన్నవారు, నేరస్థుల సంఖ్య గణనీయంగానే ఉన్నది. అసోసియేషన్స్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ మేరకు వెల్లడించిన నివేదికలో.. పార్టీల వారీగా అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పేర్కొన్నది. నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లతో పాటు పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లు మొత్తం 355 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 63 మంది (18శాతం మంది) తమపై క్రిమినల్ కేసులున్నట్టు తెలిపారు. ఇక 39 మంది (11శాతం మంది) తమపై తీవ్రమైన నేరపూరిత కేసులున్నట్టు చెప్పారు. ఇలాంటి నేరాలు నాన్బెయిలబుల్ కేసులు. వీటికి ఐదేండ్లకు
పైగానే జైలు శిక్ష ఉంటుంది. పార్టీలవారీగా చూసుకుంటే.. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న 28 మంది అభ్యర్థుల్లో 14 మంది (50శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్టు తమ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని ఏడీఆర్ వివరించింది. బీజేపీ నుంచి 28 మందికి గానూ 12 మంది (43శాతం మంది)పై నేరపూరిత కేసులున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి ఎనిమిది మంది (29శాతం), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి 14 మందికి గానూ నలుగురు (29శాతం), 178 మంది ఇండిపెండెంట్లలో 16 మంది (9శాతం) తమపై క్రిమినల్ కేసులన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు.
తీవ్రమైన క్రిమినల్ కేసుల విషయంలో బీజేపీ అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ పార్టీ నుంచి ఎనిమిది మంది(29శాతం)పై కేసులున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆరు మంది (21శాతం), బీఎస్పీ నుంచి ముగ్గురు, ఎస్పీ నుంచి నలుగురు ఉన్నారు. ఇండిపెండెంట్లలో 13 మందిపై తీవ్రమైన నేరారోపిత కేసులున్నాయి.
23 శాతం మంది కోటీశ్వరులే..బీజేపీ నుంచే అధికం
పోటీచేయబోతున్న అభ్యర్థుల్లో సంపద విషయంలోనూ బీజేపీ అభ్యర్థులే ముందున్నారు. మొత్తం 355 మంది అభ్యర్థులల్లో 80 మంది (23శాతం) కోటీశ్వరులున్నట్టు అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ వివరించింది. ఇందులో బీజేపీ నుంచి 23 మంది (82శాతం), కాంగ్రెస్ నుంచి 22 మంది (79శాతం), బీఎస్పీ నుంచి 13 మంది (46శాతం), ఎస్పీ నుంచి ఇద్దరు (14శాతం) సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఇక ఇండిపెండెంట్లలో 14 మంది ఎనిమిది శాతం మంది కోటీశ్వరులుండటం గమనార్హం.