Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూముల కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
శ్రీనగర్ : కాశ్మీర్ ను కార్పొరేట్లకు అప్పగించే ప్రకియలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో అడుగుముందుకేసింది. జమ్ము-కాశ్మీర్, లడఖ్లలో భూముల కొనుగోళ్లపై ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ జమ్ము కాశ్మీర్ భూ యాజమాన్య చట్టంతో పాటు, మరికొన్ని చట్టాలకు సవరణ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జారీ చేసిన గెజిట్ ప్రకారం జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలోని భూములను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టంలో 'రాష్ట్రంలోని శాశ్వత నివాసులు మాత్రమే భూములు కొనుగోలు చేయాలి.' అంటూ ఉన్న నిబంధనను తాజా ఉత్తర్వుల్లో తొలగించారు. గత ఏడాది ఆగస్టులో జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 320, ఆర్టికల్ 35-ఏ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరకూ జమ్ము కాశ్మీర్లోని భూములను స్థానికేతరులు సొంతం చేసుకోడాన్ని అక్కడి చట్టాలు గట్టిగా నిషేదించేవి. ఇది టూరిజం అభివృద్ధికి అడ్డంగా ఉందని అనేక కార్పొరేట్ సంస్థలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకహోదా, స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన సందర్భంలోనే భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, వివిధ చట్టాల్లోని అంశాలు ఆ నిర్ణయం అమలుకు ఆటంకంగా మారాయి. ఈ నేపథ్యంలో భూ యజమాన్య చట్టానికి సంబంధించిన 26 చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ 'జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (కేంద్ర చట్టాల వర్తింపు) చట్టాన్ని మంగళవారం జారీ చేసింది. దీంతో బయటవారు ఎవరైనా భూములు కొనడానికి, అమ్ముకోవడానికి, అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఏర్పడింది. జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ షిన్హా విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ భూములను తాజా ఉత్తర్వుల నుండి మినహాయించినట్టు తెలిపారు. అయితే, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడానికి అనేక అవకాశాలను చట్టంలో పొందుపరిచారు. విద్య, వైద్య సంస్థల ఏర్పాటు పేరిట ఈ తరహా మార్పులను చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందిస్తూ జమ్మూ కాశ్మీర్ను కేంద్రం అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. దీని వల్ల చిన్న భూ యజమానులు నష్టపోతారని ఆయన పేర్కొన్నారు.