Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న దేశవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధనం : ఏఐకేఎస్సీసీ
- నవంబర్ 26, 27 తేదీల్లో చలో ఢిల్లీ
- రైతు చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ఏఐకేఎస్సీసీ నేతృత్వంలో రైతు సంఘాల నేతల భేటీ
- ప్రజా వ్యతిరేక విద్యుత్ బిల్లుపైనా పోరాడుతాం: హన్నన్ మొల్లా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భారత రైతాంగానికి హాని చేకూర్చే రైతు చట్టాలకి వ్యతిరేకంగా నవంబర్ ఐదవ తేదీన దేశవ్యాప్తంగా రోడ్ దిగ్బంధనం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు ప్రత్యేకంగా సమావేశమై తీర్మానించారు. దాంతోపాటు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును తీసు కొస్తుందని, ఈఅంశంపై కూడా ఉధృతంగా పోరాడాలని నిర్ణయిం చారు. 500 రైతు సంఘాలతో ఏర్పాటైన ఏఐకేఎస్సీసీ నేతలు మంగళ వారం దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆలిండియా కిసాన్సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మీడియాతో మాట్లాడారు. ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమించాలని నిర్ణయించినట్టు వివరించారు. భారత రాజ్యాంగ ప్రకారం విద్యుత్, వ్యవసాయం రంగాలు రాష్ట్ర జాబి తాలోని అంశాలని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో ఆయా రంగాలను కేంద్రీకృతం, కార్పొరేటీకరణ చేసేందుకు యోచిస్తుందన్నారు. ఈ అంశాల పౖ పోరాటం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణపై తాము సమాలోచనలు జరిపినట్టు ఆయన చెప్పారు. ఏఐకేఎస్సీసీ కన్వీనర్ విఎం సింగ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేస్తామన్నారు. పంజాబ్ రైతులు చేస్తున్న ఉద్యమం, దేశంలోని ఇతర రైతు ఉద్యమాలకి మరింత స్ఫూర్తి నిచ్చిందన్నారు. రోడ్ బ్లాక్ కార్యక్రమం దేశంలోని ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర రాజధానుల్లోని ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ అధికార భవనాల ముందు నిరసన తెలపనున్నట్టు వివరించారు. రైతు స్వాభిమాన్ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలపై వీరోచితం గా పోరాడుతున్న పంజాబ్ రైతులని భయ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుం దన్నారు. అందులో భాగంగానే ఆ రాష్ట్రానికి రైళ్ళని నడపటం ఆపేసిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలుపు తున్న వర్గాలపై ప్రభుత్వం ఇటువంటి కక్ష్యపూరిత చర్యలకి ఒడిగట్టడం సరికాదన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దావలే, జాయింట్ సెక్రటరీ విజూకృష్ణన్, కోశాధికారి కృష్ణ ప్రసాద్, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ,ఇతర సంఘాల నాయకులు దర్శన్ పాల్, ప్రేమ్ సింగ్, రాజు శెట్టి, ప్రతిభా షిండే, బల్బీర్ సింగ్ రాజేవాల్, గుర్నామ్ సింగ్ చాందునీ, తదితరులు పాల్గొన్నారు.