Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, అమెరికా సైనిక పొత్తును ఖండించిన సీపీఐ(ఎం), సీపీఐ
న్యూఢిల్లీ : మంగళవారం ఇక్కడ జరిగిన భారత్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశంలో భౌగోళిక ప్రాదేశిక సహకారానికి సంబంధించి కుదిరిన ఒప్పందంపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు స్పందించాయి. తాజాగా బీఈసీఏ (మౌలిక మార్పిడి, సహకారం ఒప్పందం)పై సంతకాలు చేయడం ద్వారా భారత్, అమెరికా మధ్య సైనిక పొత్తుకు అవసరమైన ప్రాధమిక ఒప్పందాలన్నీ పూర్తి చేసినట్టయిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. నవంబరులో క్వాడ్ భాగస్వాముల మధ్య ''మలబార్ ఎక్సర్సైజెస్'' పేరుతో సంయుక్త నావికా విన్యాసాలు కూడా చేపట్టనున్నట్టు ఇప్పటికే ఇరు దేశాలు ప్రకటించాయి. ఇటీవల లడఖ్లో వాస్తవాధీన రేఖ పొడవునా చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలన్నింటినీ ఇరు దేశాల ప్రభుత్వాలు సమర్దిస్తున్నాయి. కానీ, ప్రస్తుత సంక్షోభానికి చాలా ముందుగానే ఈ ఒప్పందాలన్నింటికీ పునాదులు పడ్డాయని వారు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాల కాలంలో లాజిస్టిక్స్ ఎక్సేఛేంజ్ అగ్రిమెంట్, కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్లను కుదుర్చుకోవడం, క్వాడ్ ఫోరమ్ను ఆధునీకరించడం వంటి చర్యలను ఇరు దేశాలు చేపట్టాయి. తాజా ఒప్పందాల నేపథ్యంలో భారత సాయుధ బలగాలు, అమెరికా సైన్యానికి, దాని వ్యూహాత్మక చర్యలకు కట్టుబడి వుండా ల్సి వస్తుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ వ్యవ స్థలను అనుసంథానించడం వల్ల భారత రక్షణ వ్యవస్థ సమగ్ర, స్వతంత్ర నిర్ణయాక క్రమం తీవ్రంగా దెబ్బ తిననుందని ఆందోళన వ్యక్తం చేశాయి. 'ఈ ఒప్పందాలన్నీ మనం అమెరికా ఆయుధాలపై ఆధారపడేలా చేస్తాయి. అమెరికా ఆయుధ వ్యవస్థ సాంకేతికత, వ్యవస్థలన్నీ పూర్తిగా అమెరికా ప్రభుత్వ నియంత్రణలో వుంటాయి. అమెరికాతో కొత్తగా కుదుర్చుకున్న ఈ మిలటరీ పొత్తు వల్ల భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని' ప్రకటన ద్వారా హెచ్చ రించాయి. ఈపర్యవసానాలు జాతీయ ప్రయోజనాలకు ఏమాత్రమూ అనుగుణంగా వుండవని స్పష్టం చేశాయి. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉన్నత రాజకీయ, దౌత్య స్థాయిల్లో చైనాతో భారత ప్రభుత్వం చర్చలను కొనసాగించాలి. దీనికోసం ఆసియాలో అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహానికి భారత్ తలొగ్గాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని సీపీఐ(ఎం), సీపీఐ నేతలు స్పష్టం చేశారు.