Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ లో వలసకార్మికుల గోస అరణ్యరోదనే..
- ప్రభుత్వ పథకాలేవీ వర్తించవు : ఎస్ఏఏపీఈ నివేదిక
- ప్రజాకర్షణ పథకాలతో మార్పు రాదు : పరిశోధకులు
- కేరళలో వలస కార్మికులకు గుర్తింపుకార్డులు
- వాటితో విద్య, వైద్యం, సంక్షేమం అమలు
న్యూఢిల్లీ : భారత్ లో కోట్లాదిమంది వలసదారులు స్వంత దేశంలో పరాయి వాళ్లలాగా బతుకుతున్నారని, వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపూ ఉండటం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. కాట్మాండ్కు చెందిన 'సౌత్ ఏసియా అలయన్స్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్' (ఎస్ఏఏపీఈ) ఈ నివేదికను విడుదలచేసింది. దక్షిణాసియా దేశాల్లో అభివృద్ధి అన్నది అందరికీ సమానంగా పంపిణీ కాలేదు. వ్యవసాయ సంక్షోభం, ప్రకృతి విసురుతున్న సవాళ్లతో గ్రామీణ ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇదంతా కూడా వారిని తమ స్వంత గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతానికి వలస వెళ్లేట్టు చేస్తోందని నివేదిక రూపకల్పనలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. 'మైగ్రేషన్ ఇన్ సౌత్ ఏసియా: పావర్టీ అండ్ వలనరబులిటీ' అనే పేరుతో ఈనివేదికను రూపొందించారు. దక్షిణాసి యాలోని వివిధ దేశాల్లోని ఆయా ప్రభు త్వాలు అక్కడి అంతర్గత వలసదారుల సమస్యను పరిష్కరించలేకపోతు న్నాయని ఇందులో తెలిపారు.
వాళ్ల గోడు వినేవారే లేరు
ఇతర దేశాల్లోని వలసదారుల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసు కొచ్చామని మోడీ సర్కార్ చెప్పుకుంటోంది. విచిత్రం ఏంటంటే, భారత్లో అంతర్గతంగా కోట్లాదిమంది వలసదార్లు అనేక కష్టాలకు, నష్టాలకు గురవుతున్నారు. ప్రభుత్వపరంగా వీళ్ల గోడు వినే అధికార వ్యవస్థ లేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వీరంత భారత పౌరులే. కానీ వీరి సమస్యలు, కష్టాలు పాలకులకు పట్టదు. అంతర్గత వలసదార్లంతా స్వంత దేశంలో పరాయివాళ్లలాగా బతుకు వెళ్లదీస్తున్నారు.
పౌరసత్వం ఉండి లాభమేంటి?
నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, భారత్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వలస సమస్యలపై 165పేజీల నివేదికను ఎస్ఏఏపీఈ విడుదల చేసింది. ఆయా దేశాల్లో వలసదార్లు నిరాదరణ, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దాంతో వారిలో పౌష్టికాహారలోపం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, నిరక్షరాస్యత వంటివి పెద్ద ఎత్తున ఉంటున్నాయి. ఎక్కడా ఎవరూ ఆదరించకపోవటం వల్ల, ఒకచోట నుంచి మరో చోటకు జీవనం కోసం వలసవెళ్తున్నారు. ఆయా జాతులకు మానవహక్కులు, గౌరవం అందనంత దూరంలో ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో వీరికి పౌరసత్వంఉంది. అది ఉండి లాభమేంటో అర్థం కావటం లేదని ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. వలసదార్ల శ్రమను పాలకులు సొమ్ము చేసుకుంటున్నారు. అయినా కూడా వారికి అంతర్జాతీయ సంస్థల సహకారంగానీ, సామాజిక సంరక్షణ పథకాలుగానీ ఉపయోగపడటం లేదు. స్వేచ్ఛాయుత జీవనం పొందటంలోగానీ, పేదరికం నుంచి బయటపడటానికిగానీ వారికి ఎలాంటి ప్రభుత్వ సాయమూ లేదు. ఉదాహరణకు బంగ్లాదేశ్లో గార్మెంట్ పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో వలసదార్లు పనిచేస్తున్నారు. నిర్మాణరంగంలో కార్మికులుగా, ఇంటి పనివారిగా ఉన్నారు. వీరికి ప్రభుత్వ పథకాల అమలుపై అక్కడి పాలకులు దృష్టిపెట్టడం లేదు.
అభివృద్ధికి దూరంగా బతుకులు
భారత్లాంటి దేశాల్లో నగరాల అభివృద్ధి అంతా కూడా వలసదార్ల శ్రామికశక్తితో ముడిపడి ఉంది. నగరాల్లో, పట్టణాల్లో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికుల లోటును వలసదారులు భర్తీ చేస్తున్నారు. తద్వారా నగరాలు, పట్టణాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. కానీ ఈ అభివృద్ధికి దూరంగా అసమానతల మధ్య వలసదార్లు జీవించాల్సి వస్తోంది. భూటాన్లోనూ ఈ తరహా ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నాయి.
కార్పొరేట్లకు సహజ వనరులు
అసమానతలు, పేదరికం, ఉపాధిలేమి అంతర్గత వలసలు పెరగ డానికి కారణమవుతోంది. ప్రజలందరికీ చెందిన భూమి, నీరు, అడవి వంటి సహజ వనరులు బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ల చేతికి చిక్కుతున్నాయి. భారత్ (ఆయుష్మాన్ భారత్), పాకిస్తాన్ (ఎహసాస్) దేశాల్లో పాలకులు ప్రకటిస్తున్న పథకాల పేర్లు గొప్పగా ఉంటున్నాయి తప్ప, పేద ప్రజలకు చేసిందేమీ లేదు.
ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆరోగ్య సేవల్ని అమలుజేయటంలో కేరళ అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాల్ని ఇస్తోందని నివేదికలో పరిశోధకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉదాహరణకు అంతర్గత వలసదార్లకు అక్కడి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇస్తోందని తెలిపారు. తద్వారా ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులుగా చేరడానికి ఇది దోహదపడుతోంది. 'గెస్ట్ వర్కర్స్' విభాగంలో ఆ రాష్ట్రంలో వలసదార్ల పిల్లలు చదువుకోవడానికి, వైద్య సేవలు పొందడానికి ఆస్కారం ఏర్పడిందని నివేదిక పేర్కొంది.