Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రైతాంగాన్ని ఇబ్బందుల పాల్జేసే కాలా కానూన్(నల్ల చట్టాల)ను మోడీ సర్కారు వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా డిమాండ్చేశారు. రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి తొలినుంచి చిన్నచూపు ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం ఇక్కడ జంతర్మంతర్ వద్ద ఏఐకేఎస్, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఏడబ్ల్యూయూ, ఐఎఫ్టీయూ, సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ నుంచి సంసద్ మార్గ్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం హన్నన్ మొల్లా మాట్లాడుతూ... రైతులకు నష్టం కలిగించే విధంగా ఆ చట్టాల్లో ఏమి లేదని ప్రభుత్వం బుకాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి లేకపోతే ప్రభుత్వం రైతులతో గానీ, రైతు సంఘాలతో గానీ ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు. రైతులను చర్చలకి పిలిచి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరుకానీ దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటూ దాడులు చేయడం హేయనీయం అన్నారు. మోడీ సర్కారు హయాంలో కార్మికులు, కర్షకులు ఎవ్వరూ సంతోషంగా లేరన్నారు. అన్నివర్గాల ప్రజానీకాన్ని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికుల సమస్యలపై స్పందించేంత వరకు నిరసన తెలుపుతామన్నారు. కాగా, ఈ ధర్నాలో ఏఐకేఎస్ కోశాధికారి విజయప్రసాద్, ఏఐఏడబ్ల్యూయూ నాయకుడు విక్రమ్ సింగ్, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధూ, ఐద్వా నేత ఆశాశర్మ తదితరులు పాల్గొన్నారు.