Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ, అంబానీల కోసమే చట్టాలు : బృందాకరత్
- రైతు ఉద్యమానికి సంఘీభావంగా వామపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తపనంతా అదానీ, అంబానీల గురించేనని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. గత ఏడు రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. బుధవారం నాడిక్కడ స్థానిక కన్నట్ప్లేస్ నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే మార్గమధ్యలోనే బరోడా బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద వామపక్ష నాయకులను, కార్యకర్తలను పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, కార్యకర్తలు రోడ్డుపైనే బైటాయించారు. రైతులకు మద్దతుగా, మోడీ సర్కార్, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్లకార్డు చేబూని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ మాట్లాడుతూ దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో ఉద్యమిస్తున్న లక్షలాది మంది రైతులకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. రైతులకు మద్దతుగా వామపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చాయని తెలిపారు. మోడీ సర్కార్ పెట్టుబడిదారుల, కార్పొరేట్ల అనుకూల విధానాలు దేశ ప్రజలకు నష్టం చేస్తున్నాయని విమర్శించారు. దేశ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల పక్షాన తాము పనిచేస్తున్నామనీ, మన్ కీ బాత్లో ప్రధాని మోడీ కేవలం అదానీ, అంబానీల పక్షానే మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు తమ సంపూర్ణ మద్దతు
ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం చర్చలు జరిగాయనీ, కానీ అసంపూర్ణంగా ముగిశాయని అన్నారు. అభ్యంతరాలుంటే తెలియజేయాలని చర్చల సందర్భంగా రైతు సంఘాలను ప్రభుత్వం కోరిందనీ, అయితే పార్లమెంట్లో ఈ చట్టాలపై చర్చకు ఎందుకు కేంద్రం అనుమితించలేదని ప్రశ్నించారు. అప్రజాస్వామికమైన ఆ చట్టాలను రద్దు చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదన్నారు.
దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం: బివి రాఘవులు
న్యాయమైన డిమాండ్ల కోసం జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. దేశంలో రైతుల పోరాటం ఉధతం అవుతుంటే, కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శిం చారు. పార్లమెంటులో చర్చించకుండా అడ్డుతగిలి.. ఇప్పుడు ప్రతి క్లాజుపై చర్చిద్దా మనటం దారుణమన్నారు. ఈ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాల ని, ప్రజా వ్యతిరేక విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.