Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటార్నీ జనరల్ వేణుగోపాల్
న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులు, ట్రయల్ కోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఒక్క మహిళా కూడా చీఫ్ జస్టిస్గా లేదని ఆయన గుర్తు చేశారు. '' న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే విషయంలో సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలి. సుప్రీంకోర్టు నుంచే ఈ మార్పు ప్రారంభం కావాలి. అన్ని నాయకత్వ స్థానాల్లో కనీసం 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా లక్ష్యాన్ని సాధించాలి'' అని ఆయన అన్నారు. మహిళల ప్రాతినిధ్యం పెంచడంతో న్యాయవ్యవస్థలో సమతుల్యత సాధించడంతో పాటు మహిళలపై వేధింపులు, లైంగికదాడి విషయాల్లో తగిన పరిష్కారం లభించవచ్చని తెలిపారు. లైంగిదాడుల బాధితుల విషయంలో ట్రయల్కోర్టులు, హైకోర్టులు నిందితులకు బెయిల్లు ఇస్తున్న విధానం, వ్యవహరిస్తున్న తీరుపై అడ్వకేట్ అపర్ణ భట్ దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా వేణుగోపాల్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ పిల్పై సుప్రీంకోర్టు ఆయన సూచనలను కోరింది.