Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి, పలువురికి తీవ్ర అస్వస్థత
- మోరెనా జిల్లాలో ఘటన
- గతేడాది అక్టోబర్లో 15 మంది కల్తీకాటుకు కార్మికులు బలి
భోపాల్: మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన ఎంపీలోని మోరెనా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. అలాగే, తీవ్ర అస్వస్థతకు గురైన మరో 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని చెహ్రా మాన్పూర్, పెహ్వాలీ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పెహ్వాలీ గ్రామంలో ముగ్గురు, మాన్పూర్ గ్రామంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా పది మంది గ్వాలియర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి అక్రమ మద్యం అమ్ముతున్న నలుగురు అనుమానితులను గుర్తించామని ఐజీ చంబల్ రేంజ్ మనోజ్ శర్మ తెలిపారు. శవ పరీక్షలు పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా, గతేడాది అక్టోబర్లోనూ రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.