Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ చేరిన వేలాది ట్రాక్టర్లు
- అవుటర్ రింగ్ రోడ్లో మార్చ్
- అధికారిక గణతంత్ర దినోత్సవానికి అంతరాయం ఉండదు
- ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
- 53వ రోజు కొనసాగిన ఆందోళన
- చట్టాలు రద్దు చేసేవరకూ ఉద్యమం ఆగదన్న నేతలు
- ఇప్పటి వరకు 121 మంది రైతులు మృతి
లక్ష ట్రాక్టర్లతో కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నిర్వహిస్తామని రైతులు స్పష్టం చేశారు. జనవరి 26న ఢిల్లీ అవుటర్ రింగ్రోడ్లో పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. పరేడ్ కోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వేలాది ట్రాక్టర్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఇంకా వేలాది ట్రాక్టర్లు ఢిల్లీ మార్గ మధ్యలో ఉన్నాయి. ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్రం వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతున్నది. కొత్తగా అనేక మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. రైతుల ఆందోళన ఆదివారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. తెలంగాణ నుంచి దాదాపు రెండు వందల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధ్యా యులు ఢిల్లీకి చేరుకొని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. ఆదివారం ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘు వద్ద రైతు సంఘాలనేతలు సమావేశం అయ్యారు. అనంతరం రైతు సంఘాల నేతలు మీడియా సమావేశంలో మాట్లా డారు. ఢిల్లీకి రాని ప్రజలు తమ రాష్ట్ర రాజధాని మరియు జిల్లాల్లో నిరసన తెలుపుతారని రైతు నేతలు స్పష్టం చేశారు. రాజస్థాన్లోని అన్నిజిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించబడు తుందని, ఈ ర్యాలీలో పాల్గొనాలని జయప్రదం చేయాలని రైతు నాయకులు పిలుపు నిచ్చారు. లోక్ సంఘర్ష్ మోర్చా నాయకత్వంలో మహారాష్ట్ర, గుజరాత్లోని గిరిజన ప్రాంతాల నుండి వెయ్యి మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. 12 రాష్ట్రాల విద్యార్థులు నేతృత్వంలో బైక్ ర్యాలీ ఢిల్లీకి బయలు దేరింది. మహారాష్ట్రలోని ముంబయిలో మెరైన్ లైన్స్ నుంచి ఆజాద్ మైదాన్ వరకు ''గ్రాండ్ కిసాన్ మోర్చా'', ''ముంబయి విత్ ఫార్మర్స్'' ను కిసాన్ అలయన్స్ ఫ్రంట్ నిర్వహించింది. ఇందులో వేలాదిమంది పౌరులు పాల్గొన్నారు. ఎన్ఐపీఎం నిర్వహించిన ''కిసాన్ జ్యోతి యాత్ర''లో మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన యువ రైతులు ఢిల్లీ వైపుగా కదం తొక్కారు. కర్నాటకలోని బెంగళూరులో భారీ ఆందోళన నిర్వహించారు. బీహార్లోని 20 జిల్లాల్లో వందలాది కిలోమీటర్ల నిరవధిక పికెటింగ్ లు, భారీ బహిరంగ సమావేశాలు, రైతు ర్యాలీలు జరిగాయి. రైతులు గ్రామాలకు వెళ్లి పంచాయతీలు నిర్వహిస్తున్నారు.
కేరళ నుంచి సుమారు 1,000 మంది రైతులు 3,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి షాజహన్పూర్ వద్ద జరుగుతున్న ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ ఒరిస్సాలోని గంజాం జిల్లాలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ఒరిస్సా నుంచి ఢిల్లీకి బయలుదేరిన కిసాన్ చేత్నా యాత్రకు బీహార్లో రైతులు స్వాగతం పలికారు. రాజస్థాన్ రైతులు, కూలీలు షాజహన్ పూర్ సరిహద్దుకు చేరుకున్నారు. ఉత్తరాఖండ్ నుంచి 20,000 మంది రైతులు తమ ట్రాక్టర్లను ఢిల్లీకి తరలించేం దుకు సిద్ధమయ్యారు. ఈ ట్రాక్టర్లతో పాటు, ఇతర ట్రాక్టర్లు జనవరి 26న ఢిల్లీలోకి ప్రవేశిస్తాయని రైతు సంఘాల నేతలు తెలిపారు. రాజ్పథ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ అవుటర్ రింగ్రోడ్లో కిసాన్ పరేడ్ జరుగుతుంది. ట్రాక్టర్ మార్చ్లో పాల్గొనడానికి రైతులు పంజాబ్లోని లుధియానా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ''మేము జనవరి 26న దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తాము. ర్యాలీలో సుమారు లక్ష ట్రాక్టర్లు ఉంటాయి'' అని రైతు నేత మీడియాకు చెప్పారు. రైతుల ఆందోళనల్లో ఇప్పటివరకు 121 మంది రైతులు మతి చెందారు.
అధికారిక గణతంత్ర దినోత్సవానికి అంతరాయం ఉండదు
సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్పాల్ మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా తాము ఆందోళనలు చేస్తున్న రైతులకు ఎన్ఐఏ నోటీసులు ఇచ్చే అంశాన్ని లేవనెత్తామని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని అన్నారు. అయినప్పటికీ ఆందోళనలు చేస్తున్న రైతులకు నోటీసుల పరంపర కొనసాగడం ప్రభుత్వ సిగ్గులేనితనం స్పష్టం చేస్తున్నదని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తాము కూడా ఎన్ఐఏ నోటీసులకు ప్రతిస్పందనగా చట్టపరమైన చర్యలు కూడా డిమాండ్ చేస్తామని అన్నారు. రైతు నేత యోగేంద్రయాదవ్ మాట్లాడుతూ తమకు ఎటువంటి అనుమతి అక్కర్లేదని, ర్యాలీ గురించి తాము ప్రభుత్వానికి ముందుగానే సమాచా రం అందించామని స్పష్టం చేశారు. ట్రాక్టర్ మార్చ్ చేస్తా మని, ఇది తిరుగుబాటు కాదని అన్నారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని అవుటర్ రింగ్ రోడ్లో రైతులు జాతీయ జెండాతో ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారని, అధికారిక గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం ఉండదని అన్నారు. ఎన్నికలకు ముందు ఎవరు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేస్తారనే దాని గురించి తెలుసుకున్న రోజునే, ప్రభుత్వ సమస్యల గురించి తెలుసుకుంటామని యోగేంద్ర యాదవ్ అన్నారు. రైతు నేత శివకుమార్ కక్కా మట్లాడుతూ తాము గాంధేయ విలువలను అనుసరిస్తున్నామని, వారు ఏదైనా చేసినా తాము చేయి ఎత్తబోమని, వారు చేసిన పనులకు వారే మూల్యం చెల్లిస్తారని అన్నారు. తాము ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని, భవనాన్ని ఆక్రమించబోమని తెలిపారు. గ్రామాల్లోని మహిళలు దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులలో ప్రార్థనలు చేస్తున్నారని, రైతు పోరాటంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. మరోవైపు నూతన చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఉద్యమం ఆగదని, ప్రభుత్వం స్పందించకపోతే మే 2024 వరకైనా ఉద్యమం చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు రాకేశ్ తికాయిత్ అన్నారు. నాగపూర్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించే వరకూ పోరాడుతూనే ఉంటామని తెలిపారు. చట్టాల అమలుపై స్టే ఇవ్వడం కాదని, పూర్తిగా చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రైతుల ఉద్యమం అంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు.
19న నిపుణుల కమిటీ తొలి భేటీ
నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ తొలి భేటీ ఈనెల 19న జరగనున్నట్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వాత్ తెలిపారు.కమిటీ సభ్యుల్లో ఒకరైన భుపిందర్ సింగ్ కమిటీ నుంచి నిష్క్రమించిన విషయం విదితమే. ఈలోగా సుప్రీంకోర్టు మరో సభ్యుడిని సూచించని పక్షంలో డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషీ, అశోక్ గులాటీలతో కలిసి ముగ్గురే భేటీ అవుతామని అనిల్ ఘన్వాత్ తెలిపారు. జనవరి 21 నుండి తమ పని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.