Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ 1990నాటి పరిస్థితులు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : గత రెండున్నర ఏండ్లుగా జమ్మూకాశ్మీర్లో కేంద్ర పాలన నెలకొనడంతో ఆ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా రాజ్యసభ ఎన్నికలు నిలిచిపోయాయి. రాజ్యసభలో ఈ రాష్ట్రానికి మొత్తం నాలుగు స్థానాలున్నాయి. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, పీడీపీ నుంచి మహమ్మాద్ ఫయాజ్, నాజిర్ అహ్మద్, బీజేపీ నుంచి షంశేర్ సింగ్ మాన్హాస్ల రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15తో ముగియనున్నది. ఈనేపథ్యంలో ఖాళీ అవుతున్న ఈ స్థానాల్లోకి ఫిబ్రవరి 15నుంచి కొత్త సభ్యులు పదవీ స్వీకారం చేయాల్సింది. కానీ జమ్మూకాశ్మీర్లో కేంద్ర పాలన విధించటం వల్ల ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం పూర్తిస్థాయిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 1990లనాటి మిలటరీ పాలనను తలపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆనాడు రాష్ట్రం నుంచి కనీసం ఒక్కరూ కూడా రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకుండా పోవడానికి కారణం మిలటరీ పాలనే. దాదాపు ఆరేండ్లకాలం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవటంతో ఒక్కరు కూడా రాజ్యసభ్యులుగా ప్రాతినిథ్యం వహించే అవకాశం ఏర్పడలేదు. శాంతిభద్రతల పేరుతో కాశ్మీర్లో పదే పదే కేంద్రం జోక్యం చేసుకోవటం, కేంద్ర పాలన విధించటం చేస్తోంది. గత 30 ఏండ్ల కాలంలో అక్కడ దాదాపు 10ఏండ్లు కేంద్ర పాలన కొనసాగింది. దాంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పాకిస్తాన్ పేరు చెప్పి పలుమార్లు ప్రజాసామ్య ప్రభుత్వాల్ని రద్దు చేయటం వివాదాస్పదమవుతూ వస్తోంది. ప్రజా పాలన దెబ్బతిని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ దూరమయ్యాయి. రాజకీయ శూన్యత పెరిగి అశాంతికి కారణమవుతోంది. కాశ్మీర్ నుంచి కనీసం ఒక్కరు కూడా రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకపోవటం పెద్దలోటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 నవంబరులో రాష్ట్ర శాసనసభను గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు.