Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర ఎంపీ, ఐద్వా నాయకురాలిపై దాడి, కార్యాలయంలో విధ్వంసం
- కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చిన బీజేపీ గూండాలు
అగర్తలా : త్రిపురలో బీజేపీకి చెందిన సంఘ విద్రోహశక్తులు మళ్లీ రెచ్చిపోయాయి. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై తాజాగా పెద్దఎత్తున హింసాత్మక దాడులకు తెగబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చోటుసుకున్న ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బీజేపీకి చెందిన సంఘ విద్రోహ శక్తులు ఇష్టమొచ్చినట్టుగా చెలరేగిపోతున్నాయని, బీజేపీ నాయకత్వం తెరవెనుకుండి ఇదంతా నడిపిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల ఘటనను తీవ్రంగా ఖండించింది. త్రిపురలో అధికార పార్టీగా శాంతిభద్రతలు నెలకొనేలా చూడాల్సిన బీజేపీయే ఈ తీరుగా వ్యవహరించటం చాలా దారుణమని పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఈ తీరుగా రెచ్చిపోవటాన్ని త్రిపుర ప్రజలు సహించరని పొలిట్బ్యూరో తెలిపింది. ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించింది.
ఆదివారం సాయంత్రం సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయంలో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించి, అక్కడ కనిపించిన కమ్యూనిస్టు కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు. త్రిపుర రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర కమిటీ కార్యదర్శి, సిట్టింగ్ రాజ్యసభ ఎంపీపై బీజేపీ గూండాలు అత్యంత పాశవికంగా దాడికి దిగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహిళా ఎంపీపై, ఆమె భద్రతా సిబ్బందిపైనా బీజేపీ గూండాలు దాడులు చేశారు. ఇంటి ఆవరణలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఎంపీ ఇంట్లోని కొంత మొత్తం నగదును, ఇతర విలువైన సామాగ్రిని దొంగిలించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సీపీఐ(ఎం) కార్యకర్తలపై బీజేపీ గూండాలు హింసాత్మక దాడికి దిగటం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. మరోచోట సబ్ డివిజనల్ కమిటీ కార్యాలయంపై దాడి జరిపి, అక్కడున్న కార్యదర్శిని, భద్రతా సిబ్బందిని తీవ్రంగా గాయపర్చారు. పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు.