Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీటీవీ మాజీ జర్నలిస్టు నిధి రజ్దాన్ ఆవేదన
న్యూఢిల్లీ : హార్వర్డ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా అవకాశం వచ్చిందని నమ్మించి తనకు తప్పుడు సమాచారం అందించి తన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం తస్కరించారంటూ ఎన్డీటీవీ మాజీ జర్నలిస్టు నిధి రజ్దాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అవకాశం వచ్చిందనుకుని 21ఏండ్ల సర్వీస్ను వదులుకుని ఆమె గతేడాదే ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చారు. అయితే అదంతా బూటకమని తర్వాత ఆమెకు ఆలస్యంగా తెలిసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ప్రకటన చేశారు. సెప్టెంబరులో హార్వర్డ్లో చేరాలని తొలుత చెప్పారనీ, తర్వాత కరోనా వల్ల తరగతులు రద్దయ్యాయనీ, జనవరిలో ప్రారంభమవుతాయని చెప్పారని ఆమె తెలిపారు. అయితే ఇంత జాప్యం జరగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తొలుత, కరోనా వల్ల పాలనాపరమైన క్రమంలో కొంత జాప్యం జరుగుతోందని భావించినా ఇటీవలే వారి వ్యవహార శైలి పట్ల అనుమానం వచ్చి స్పష్టత కోసం హార్వర్డ్ వర్సిటీ అధికారులను సంప్రదించినట్టు తెలిపారు. వారు కోరిన మేరకు, తాను జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలను యూనివర్సిటీ అధికారులకు అందచేయగా, ఇదంతా బూటకమని వెల్లడైందన్నారు. యూనివర్సిటీ వారు ఇచ్చిన వివరణతో తానొక అత్యంత అధునాతనమైన, సమన్వయంతో కూడిన దాడికి గురయ్యాయని అర్ధమైందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. వాస్తవానికి తనకు హార్వర్డ్ వర్సిటీలో ఎలాంటి అవకాశం రాలేదనీ, చాలా తెలివిగా ఫోర్జరీలతో చేశారనీ, బహుశా తన ఈ మెయిల్, సోషల్ మీడియా ఖాతాలను, తన ఫోన్లో సమాచారాన్ని కూడా వారు తస్కరించి వుండవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక గల వారిని తక్షణమే పట్టుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.