Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత హేమమాలినీకి పంజాబ్ రైతుల ఆహ్వానం
- చార్జీలు మేమే భరిస్తామని వెల్లడి
చండీగఢ్ : సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలికి పంజాబ్కు చెందిన కంధీ కిసాన్ సంఘర్ష్ కమిటీ(కేకేఎస్సీ) ఆహ్వానం పలికింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలు తమకు వివరించాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఆమె పంజాబ్ రావాలనీ, చార్జీలతోపాటు, ఫైవ్ స్టార్ హౌటల్లో వసతి ఏర్పాట్లను కూడా తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు బీజేపీ నేతకు కేకేఎస్సీ లేఖ రాసింది. కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. రైతుల ఆందోళన నేపథ్యంలో హేమమాలిని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు తమకు ఏం కావాలన్న దానిపై రైతులకు స్పష్టతలేదని వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో, వాటి వల్ల కలిగే సమస్యలు ఏంటో కూడా వారికి తెలియదని అన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్భలంతోనే వారు ఆందోళనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కేకేఎస్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 'ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పంజాబ్ కోడలినని హేమమాలిని గారు స్వయంగా చెప్పారు. గౌరవనీయులైన మిమ్మల్ని మేం వదినగా భావిస్తాం. అంటే తల్లితో సమానం. కానీ రైతు ఆందోళనలపై మీరు చేసిన వ్యాఖ్యలు పంజాబీలను బాధించాయి. 51 రోజులుగా నిరసన చేస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 100 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు కనీస మద్దతు ధర కూడా లేకుండా పంటను ఎందుకు అమ్ముకోవాలి? దయచేసి మీరు ఇక్కడకు రండి. ఆ మూడు వ్యవసాయ చట్టాల గురించి సవివరంగా తెలియజేయండి' అంటూ ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్నారు. హేమమాలిని ధర్మేంద్రను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం పంజాబ్.